TIS వివరాల నమోదుకు అడ్డంకులెన్నో - లక్ష్య సాధన కష్టమే అంటున్న ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తమ వివరాలను ఈ నెల 25వ తేదీలోపు సీఎస్సీ పోర్టల్లో నమోదు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే సాంకేతికంగా నెలకొన్న సమస్యలతోపాటు సరైన అవగాహన లేక ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేయలేక పోతున్నారు.
34 అంశాల నవీకరణ :
బదిలీలు, హేతుబద్ధీకరణ, పదోన్నతులు తదితరాలకు ప్రస్తుతం రూపొందించే ఉపాధ్యాయుల సమగ్ర సీనియారిటీ జాబితానే కీలకం. అందుకే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితా సిద్ధం చేసేదిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఉద్యోగంలో చేరిన తేదీ, బదిలీలు ఇలా మొత్తం 34 అంశాలను నవీకరించాల్సి ఉంది.
ఇప్పటివరకు ఏఏ పాఠశాలల్లో విధులు నిర్వహించారు.... శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణులు అయ్యారా, అంతర రాష్ట్ర, భార్యభర్తల బదిలీలు జరిగాయా ఇలా పూర్తి సమాచారాన్ని పొందు పరచాలి. ఉపాధ్యాయులు ఎవరికివారు టీచర్ ఇన్ఫర్మేషన్సిస్టమ్(టీఐఎస్)లో ట్రెజరీ ఐడీ ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. ఆ దిశగా మండల విద్యాశాఖాధికారులతోపాటు డీవైఈవోలు కూడా పర్యవేక్షించాలని జిల్లావిద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో పోర్టల్లో ఉపాధ్యాయుల వివరాలు ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చర్యలేవీ...?
వివరాలు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేదిశగా చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం తమ పూర్తి వివరాలు నమోదు చేసేందుకు ఎడిట్ ఆఫ్షన్ పనిచేయడం లేదని , భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే వివరాలు నమోదు చేసినా తీసుకోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇంటిపేరు నమోదు చేయాలని అడగడంతో ముస్లిం టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అనేక సాంకేతిక సమస్యల నెలకొనడంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే పలు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 11వేలమంది టీచర్ల సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోతే నిర్దేశించిన లక్ష్యంలోపు పూర్తి చేయలేమని అంటున్నారు. ఈనెల 25వ తేదీలోపు నమోదు చేస్తే వాటిని 28వ తేదీలోపు మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల ఉపతనిఖీ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
ఉన్నతాధికారులకు తెలిపాం :
సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాం. ఈమేరకు జిల్లాలో ఇద్దరికి బాధ్యతలు కేటాయించారు. వేలాదిమంది ఉపాధ్యాయులకు ఇద్దరే ఉండడంతో వారిపై భారం పడుతుంది. మండలానికి సీఆర్పీ లేదంటే ఉపాధ్యాయుల్లో ఎవరో ఒకరికి అవగాహన కల్పించి బాధ్యతలు ఇస్తే త్వరితగతిన నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
-సుందరయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
చర్యలు తీసుకున్నాం :
ఉపాధ్యాయుల వివరాల నమోదు ప్రక్రియను నిర్దేశిత సమయంలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నాం.దీనిపై డీవైఈవోలు, ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు. వారితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సాంకేతిక సమస్యలను ప్రభుత్వం నియమించిన సాంకేతికబృంద సభ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాం. ఉపాధ్యాయులు కూడా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఎంఈవోల దృష్టికి తీసుకువెళ్లాలి.
- తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి.
0 Post a Comment:
Post a Comment