హీరోయిజం కోసం చేస్తే ఎలా? : ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
‘‘ఉపాధ్యాయుల వల్ల మాత్రమే చలో విజయవాడ విజయవంతం కాలేదు. అందరు ఉద్యోగుల వల్లే విజయవంతమైంది. ఉపాధ్యాయుల పాత్ర ఒక్కటే ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజుగారి బిందెలో అందరూ పాలు పోసినట్లుగా ఉంది. హీరోయిజం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రవర్తిస్తే ఏమీ చేయలేం’ అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘‘టీచర్ల సంఘాలు ఒక్కళ్లే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతున్నామనే చాంపియన్లుగా చెప్పకోవడం.. టీచర్ల ఎమ్మెల్సీలు వారి తరపున ఉన్నారని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తే ఏమీ మాట్లాడలేం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం రాత్రి మీడియా సమావేశం నుంచి ఉపాధ్యాయ సంఘాలు బయటకు రావడంలో ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయో మాకు తెలియదు.
నిరసన అంతా టీ కప్పులో తుపాను లాంటిది. అంతా సమసిపోతుందని భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఫిట్మెంట్ కోసం అందరం కలసి అడిగాం. మంత్రుల కమిటీ తమవల్ల కాదని తేల్చడంతో... ఆదివారం సీఎం వద్ద ప్రస్తావించాలనుకున్నాం.. ఫిట్మెంట్ మినహా మిగిలిన అంశాల్లో ఎంతో కొంత పునరుద్ధరించారు. మరో 3 అంశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ మార్చి 31లోగా రోడ్మ్యా్పను తెలియజేస్తామంది. పీఆర్సీ సాధన సమితి నాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విమర్శలను పాజిటివ్గా తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’’ అన్నారు.
0 Post a Comment:
Post a Comment