గళమెత్తిన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు - కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు : పీఆర్సీ ఉత్తర్వులు, ఒప్పంద పత్రాల దహనం
మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు కలెక్టరేట్ల ముట్టడి, పురపాలక కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల పీఆర్సీ ఉత్తర్వులు, ఒప్పంద పత్రాలను దహనం చేశారు. 60వేల మంది ఒప్పంద ఉద్యోగులు, 2.40లక్షల మంది పొరుగుసేవల సిబ్బంది, 10వేల మంది పార్ట్టైం ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ఇచ్చిన హామీలకు భిన్నంగా పీఆర్సీ చర్చల్లో మంత్రుల కమిటీ నిర్ణయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కమిటీతో పీఆర్సీ సాధన సమితి చీకటి ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. పలు జిల్లాల్లో పోలీసులు నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు. విజయవాడలో ఐకాస అధ్యక్షుడు నాగేశ్వరరావును గృహ నిర్బంధం చేయగా.. ప్రధాన కార్యదర్శి బాలకాశిని ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేశారు. ఉపాధ్యక్షుడు నూర్ మహమ్మద్ను విజయవాడ ధర్నా చౌక్లో అరెస్టు చేశారు. విశాఖలో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. సమగ్ర శిక్ష అభియాన్లో పని చేసే సిబ్బంది కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.
అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు :
అనంతపురంలో మున్సిపల్ కార్మికులు నిరసన ర్యాలీ తలపెట్టగా పురపాలక కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. మహిళలు అని చూడకుండా పక్కకు లాగడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ను గృహ నిర్బంధం చేశారు. చిత్తూరు పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. తిరుపతిలో రుయా ఆస్పత్రి వద్ద నిరసనలు తెలిపారు. కర్నూలులో సంస్మరణ సభలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణను అరెస్టు చేశారు. కడపలోనూ ముందస్తుగా అరెస్టు చేశారు. ఒంగోలులో పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరులో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో జేఏసీ జిల్లా ఛైర్మన్ వై.నేతాజీ, తదితరులను గృహ నిర్బంధం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇద్దరు నేతలను మాత్రమే వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్లోకి అనుమతించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ను గృహనిర్బంధం చేశారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, ఒప్పంద, పొరుగుసేవల సంఘం నేతలు నూతరాజులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.
0 Post a Comment:
Post a Comment