టీచర్ల ఆందోళన హాస్యాస్పదం : ప్రభుత్వ సలహాదారు సజ్జల తీవ్ర అసహనం
పీఆర్సీ జీవోల రద్దు కోసం వామపక్ష టీచరు సంఘాలు చేస్తున్న ఆందోళన హాస్యాస్పదంగానూ, అపరిపక్వంగానూ ఉన్నదని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. ‘‘ఉద్యోగ సంఘాల నేతలు అమ్ముడుపోయారనడం ఏమిటి? ఇక్కడ ఆమ్ముడుపోయేవారెవరు? కొనేవారెవరు? ఆ అవసరం ప్రభుత్వానికి ఎందుకుంటుంది?’’ అని వ్యాఖ్యానించారు. మంత్రుల కమిటీతో కూర్చున్న పీఆర్సీ సాధన సమితి నేతల్లో వామపక్ష ఉపాధ్యాయ సంఘం నేతలు కూడా ఉన్నారని, చర్చలకు హాజరయినట్లు సంతకాలు కూడా చేశారని చెప్పారు. మినిట్స్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చదువుతున్న సమయంలో వారు బయటకు వెళ్లిపోయారన్నారు. ‘‘వారికి ఏమైనా అసంతృప్తి ఉంటే దానిని చర్చల సందర్భంగా చెప్పవచ్చు. కానీ, బయటకు వెళ్లి మాట్లాడడం ఏమిటి? చిరాకుపెట్టేలా వారి వైఖరి ఉంది’’ అని తెలిపారు. ఒకవైపు వామపక్ష ఉపాధ్యాయులు.. మరో వైపు ఆశావర్కర్లు.. నిరుద్యోగుల ఆందోళనలంటూ కొన్ని మీడియా సంస్థలు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆక్రోశం వెలిబుచ్చారు.
0 Post a Comment:
Post a Comment