కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
● విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
● దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత విద్యా విధానంలో మార్పు చేసింది.
● విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసింది.
● 10+2 విధానానికి స్వస్తి పలికిన కేంద్రం.. ఇకపై 5+3+3+4 విధానంలో బోధన కొనసాగుతుందని ప్రకటించింది.
● విద్యార్థుల వయసు ఆధారంగా ఫండమెంటల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ కోర్సులను బోధించనుంది.
● విద్యార్థులను కేవలం అకడమిక్స్కే పరిమితం చేయకుండా కో - కరికులర్ ప్రోగ్రామ్స్కు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా సిలబస్ రూపొందించనున్నారు.
● ఆరో తరగతి నుంచే ఒకేషనల్ ఎడ్యుకేషన్ను భాగం చేయనున్నారు.
ఫండమెంటల్ :
కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 4 నుంచి 8 ఏళ్ల పిల్లలకు ఫండమెంటల్ కోర్సు అందించనున్నారు. ఐదేళ్ల కాలపరిమితి గల ఈ కోర్సులో తొలి మూడేళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ తర్వాతి రెండేళ్లు విద్యార్థులకు ఒకటి, రెండో తరగతులు బోధన ఉంటుంది. ఫండమెంటల్ కోర్సులో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రిపరేటరీ :
8 నుంచి 11ఏళ్ల వయసు పిల్లల కోసం మూడేళ్ల ప్రిపరేటరీ కోర్సు రూపొందించారు. ఈ దశలో 3,4,5 క్లాసులకు సంబంధించిన సిలబస్ బోధిస్తారు. ప్రిపరేటరీ కోర్సులో పిల్లలకు సైన్స్, మ్యాథమేటిక్స్, ఆర్ట్స్ పరిచయం చేస్తారు. విద్యా బోధనలో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు.
మిడిల్ స్కూల్ :
మిడిల్ స్కూల్ బోధన మూడేళ్ల పాటు కొనసాగనుంది. ఈ దశలో 11 నుంచి 14ఏళ్ల పిల్లలు 6,7,8 తరగతుల వరకు బోధన జరుగుతుంది. ఆరో తరగతి నుంచే సబ్జెక్టులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పుతారు. విద్యార్థులు తమకు నచ్చిన స్కిల్క్ నేర్చుకునే అవకాశం కల్పిస్తారు.
సెకండరీ స్కూల్ :
నాలుగేళ్ల పాటు సెకండరీ స్కూల్ కోర్స్ కొనసాగనుంది. ఈ దశలో విద్యార్థుల స్కూల్ విద్య పూర్తి కానుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. సెకండరీ స్కూల్లో విద్యార్థులకు సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. పిల్లలు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం ఇస్తారు. నూతన విద్యా విధానంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి. ప్రస్తుతం పాఠశాలలతో సంబంధం లేకుండా అంగన్వాడీలు కొనసాగుతుండగా.. ప్రభుత్వ బడుల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు లేవు. కానీ కొత్త పాలసీ ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లలో సైతం ఫండమెంటల్ కోర్సులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించనున్నారు.
0 Post a Comment:
Post a Comment