పిఆర్సి నివేదిక బహిర్గతం చేయకుండా ఫిట్మెంట్ ప్రకటన.. అత్యంత హేయనీయం : ఎమ్మెల్సీ లక్ష్మణరావు
పిఆర్సి నివేదికను బహిర్గతం చేయకుండా ఫిట్మెంట్ ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదని పిడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విజయవాడ ఎన్జివో కార్యాలయంలో పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. పిడిఎఫ్ తరుపున ఉద్యోగుల ఆందోళనలకు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జగన్ సర్కార్ చేయిస్తోందని.. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జగన్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పిఆర్సి జీవోలను రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. అప్రజాస్వామిక విధానాలు అవలంభించిన ప్రభుత్వాలు కూలిపోక తప్పదన్నారు. ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టుపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారానికి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment