భయం భయంగా బడికి... విద్యార్థుల హాజరు శాతం తగ్గుముఖం
ఆకివీడు బాలుర ఉన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థులకు గాను సోమవారం 603 మంది హాజరయ్యారు. వీరిలోనూ కొందరు జలుబు, జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతుండగా తల్లిదండ్రులు వచ్చి మధ్యలోనే ఇళ్లకు తీసుకెళ్లారు.
భీమవరంలో పీఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 1098 మంది విద్యార్థినులకు గాను సోమవారం 646 మంది హాజరయ్యారు. రెండో పట్టణంలో నెహ్రూపేట ప్రాథమిక పాఠశాలలో 284 మందికి 142 మంది మాత్రమే హాజరయ్యారు.
ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదైనట్లు తెలియడంతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు.
కొవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పలు విద్యాసంస్థల్లో కొందరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థుల్లోనూ జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య లక్షణాలు బహిర్గతమవుతుండటంతో వారం నుంచి హాజరు శాతం తగ్గుముఖం పట్టిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల హాజరు 55 శాతానికి మించి ఉన్నట్లు అధికారులు చెబుతున్నా ఎక్కువ పాఠశాలల్లో సగం మంది పిల్లలు కూడా ఉండటం లేదు. పరిస్థితి చక్కబడే వరకు పిల్లలను పాఠశాలకు పంపబోమని.. కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల నిర్వాహకులు కొందరు అనారోగ్యానికి గురికావడంతో ఆహార పదార్థాల తయారీ, వడ్డన ఇబ్బందిగా మారింది.
కారణాలివీ...
ప్రస్తుతం అన్ని తరగతులకు ఒకేసారి బోధన కొనసాగిస్తున్నారు. పాఠశాలల్లో శానిటేషన్, విద్యార్థులంతా మాస్కులు ధరించడం పూర్తిస్థాయిలో జరగడం లేదు. నిర్ధరణ పరీక్షలు సరిగా లేవు.
పెరుగుతున్న జాబితా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు 41 మందితోపాటు ఒక ఎంఈవో సైతం కరోనా బారిన పడ్డారు. ఉపాధ్యాయులు 33 మంది, బోధనేతర సిబ్బంది నలుగురు, విద్యార్థులు ముగ్గురు, వీరవాసరం ఎంఈవో, ఒప్పంద ఉపాధ్యాయుడు (ఐఈఆర్టీ) ఒకరు కరోనా బారిన పడినట్లు సోమవారం విడుదలైన వైద్య పరీక్షల నివేదికల్లో వెల్లడైందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆకివీడు, తణుకు, దెందులూరు, పాలకోడేరు, చాగల్లు, ఆచంట, ఇరగవరం, జంగారెడ్డిగూడెం, వీరవాసరం, గణపవరం, కామవరపుకోట, భీమవరం, ఉండి, బుట్టాయగూడెం, కాళ్ల, కుక్కునూరు, పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు.
నిబంధనలు పాటిస్తూనే...
పాజిటివ్ కేసులు నమోదైన చోట్ల వైద్య పరీక్షలు, శానిటేషన్ చేయిస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులకు పాఠశాలల్లో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయిస్తున్నాం. - సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి
విషమ ‘పరీక్ష’..!
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే:* కొవిడ్ జిల్లాను చుట్టేస్తోంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలు కోసం వస్తే గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తి పేరు నమోదు చేయించి నమూనాల సేకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాదాపు ఐదు గంటలు పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నమూనాల పరీక్షల ఫలితాలు కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు.
0 Post a Comment:
Post a Comment