సహకరించని ఉద్యోగులపై కఠిన వైఖరి _ జీతాల బిల్లుల చుట్టూ వివాదం _ ఆదివారం కూడా పనిచేయాలని ఆదేశం _ డీడీవోలు, ఎస్టీవోలపై క్రమశిక్షణ చర్యలకు ఉత్తర్వు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారమే కొత్త జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ శనివారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం జనవరి 29 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు జీతాల బిల్లులు సమర్పించని డ్రాయింగ్ డిస్బర్సుమెంట్ అధికారులు, వాటిని ప్రాసెస్ చేయని ఉప ఖజానా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘జీతాల బిల్లులు సమర్పించేందుకు, ప్రాసెస్ చేసేందుకు ఏయే రోజుల్లో ఏ ప్రక్రియ పూర్తి చేయాలో నిర్దేశిస్తూ స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా చాలా మంది డీడీవోలు, ఎస్టీవోలు ఆ మేరకు పనులు చేయలేదు. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రోజు వారీ వేతన పనివారు, కంటింజెన్సీ ఉద్యోగులు, ఆశావర్కర్లు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే ప్రక్రియను నిర్వర్తించని వారిపై చర్యలు తీసుకుంటాం. ఇందుకు బాధ్యులైన వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని జిల్లా కలెక్టర్లు, ఖజానా డైరెక్టర్, పే అకౌంట్సు, తదితర సంబంధిత అధికారులకు నిర్దేశించాలి...’ అని పేర్కొన్నారు.
బిల్లుల సమర్పణ మందగమనమే...
జిల్లా కలెక్టర్లు రంగప్రవేశం చేసి డీడీవోలు బిల్లులు సమర్పించాల్సిందే అని ఉన్నతాధికారులను, డీడీవోలను నిర్దేశించినా ఉద్యమ కార్యాచరణలో ఉన్న సిబ్బంది ఆ ఆదేశాలను శనివారం ఖాతరు చేయలేదు. కొందరు డీడీవోలు నేరుగా జిల్లా కలెక్టర్లకే స్పష్టంగా తమ నిరసన తెలియజేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా తాము బిల్లులు సమర్పించకూడదని నిర్ణయించుకున్నామన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 1.10 లక్షల బిల్లులు సమర్పించగా శనివారం ఆ సంఖ్య మరో 7 వేలు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అందరు ఖజానా అధికారులు ఆదివారం కూడా పని చేసి జీతాల బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
0 Post a Comment:
Post a Comment