విభాగాధిపతి కార్యాలయం ఎక్కడ ఉన్నా హెచ్ఆర్ఏ 16శాతమే
కొత్త వేతన సవరణలో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాల్లో పని చేసే వారందరికీ 16శాతం ఇంటి అద్దె భత్యం వర్తించనుంది. వెలగపూడి సచివాలయం, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్న కార్యాలయాల్లో పని చేస్తున్న వారికి మాత్రమే కాకుండా విజయవాడ నగరం చుట్టుపక్కల ఎక్కడ విభాగాధిపతుల కార్యాలయాలు ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇంటి అద్దె భత్యం 8శాతం వర్తించే ప్రాంతంలో విభాగాధిపతి కార్యాలయం ఉన్నా అక్కడి ఉద్యోగులకు కూడా 16శాతం ఇంటి అద్దె భత్యం వర్తింపజేయనున్నారు. విభాగాధిపతుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇంటి అద్దె భత్యం విషయంలో ఉద్యోగుల్లో అసంతృప్తి రేగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి అమరావతి తరలివచ్చిన ఉద్యోగులు, అధికారులు అందరికీ గతంలో 30శాతం హెచ్ ఆర్ ఏ వర్తింపజేశారు. హైదరాబాద్లో ఎంత అద్దె భత్యం ఉందో అంతే మొత్తం ఇక్కడా ఇస్తూ వచ్చారు. తాజా వేతన సవరణలో భాగంగా వెలగపూడి సచివాలయంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో పని చేసే విభాగాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు 16శాతం హెచ్ ఆర్ ఏ వర్తింపజేశారు. విజయవాడ నగరం చుట్టుపక్కల 8శాతం హెచ్ ఆర్ ఏ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగాధిపతుల కార్యాలయాల సిబ్బందికి అది వర్తించలేదు. తాజా ఉత్తర్వులతో వారికీ 16శాతం వర్తించేలా ఉత్తర్వులిచ్చారు.
0 Post a Comment:
Post a Comment