AP Black Fungus Cases: ఏపీలో బ్లాక్ ఫంగస్ పెరగడానికి కారణం ఇదేనట.. పొరపాటున కూడా ఇలా చేయకండి...
👀 ఏపీని కరోనా మహమ్మారి కమ్మేసిన ఈ తరుణంలో రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. ఇందులో 14 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారు. ఏపీలో ఇంతగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడానికి కారణాలేంటని అధ్యయనం చేయగా పలు కీలక విషయాలు తెలిశాయి. ఏపీలో కరోనా వైరస్ సోకక ముందే కొందరు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ మెడికేషన్ పాటిస్తూ.. కరోనా చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి తోడు కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఉంటూ కొందరు స్వయంగా తెలిసీతెలియని సొంత వైద్యం చేసుకుంటున్నారని.. ఈ క్రమంలో స్టెరాయిడ్స్ అధికంగా వినియోగిస్తున్నారని.. అలాంటి వారిలో చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని తెలిసింది. స్టెరాయిడ్స్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి బ్లాక్ ఫంగస్ బాధితులుగా మారుతున్నారని తేలింది. ఇదిలా ఉంటే.. ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ప్రభుత్వానికి సవాల్గా మారాయి. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి వైద్యంలో భాగంగా ఇచ్చే యాంఫోటెరిసిన్ బీ వయల్స్ కొరత కూడా ఏపీని వేధిస్తోంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఏపీకి ఈ వయల్స్ అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు ఏ స్థాయిలో నమోదవుతున్నాయంటే.. ఒక్క గుంటూరు జనరల్ హాస్పిటల్లోనే దాదాపు 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. 👀 రోజుకు ఐదు నుంచి ఆరు బ్లాక్ ఫంగస్ సోకిన బాధితులకు సర్జరీ రిఫర్ చేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి చికిత్స నిమిత్తం రోజుకు సగటున పది యాంఫోటెరిసిన్ బీ వయల్స్ చేయాల్సి ఉంటుంది. ఒక్క బ్లాక్ ఫంగస్ పేషంట్కు వారానికి 80 నుంచి 100 వయల్స్ అవసరమవుతాయి. బ్లాక్ ఫంగస్ కేసులపై గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.జయధీర్ స్పందిస్తూ.. బ్లాక్ ఫంగస్ సోకిన కొన్ని కేసులను పరిశీలించాక ఓ కీలక విషయం తెలిసిందని.. కరోనా సోకకముందే తెలిసిన ప్రైవేట్ డాక్టర్ల వద్దకు వెళ్లి కరోనా మెడిసిన్ను తెచ్చుకుని ముందు జాగ్రత్త పేరుతో కొందరు స్టెరాయిడ్స్ను మోతాదుకు మించి వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు.
👀 కరోనా రాకముందే మెడిసిన్ తీసుకుంటే తమకు వైరస్ సోకినా ఏం కాదనే కొందరి ముందు జాగ్రత్త ఆలోచన బ్లాక్ ఫంగస్ సోకేందుకు కారణమవుతుందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ సోకిన తర్వాత గానీ వాళ్లు చేసింది తప్పని తెలుసుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. అనారోగ్య సమస్య ఏం ఉన్నా వైద్యులను సంప్రదించకుండా ఇలా సెల్ఫ్ మెడికేషన్ను పాటించవద్దని.. కచ్చితంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే సెల్ఫ్ మెడికేషన్ పాటించాలనుకునే వారు చికిత్స పొందాలని సూచించారు.
0 Post a Comment:
Post a Comment