Saturday 30 April 2022

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు - పరిణామ క్రమం

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు - పరిణామ క్రమం


1889 లో ప్రపంచంలో మొదటి సారిగా ప్రభుత్వ పింఛన్ విధానాన్ని  అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఒట్టోవాన్ బిస్మార్క్ ప్రవేశ పెట్టారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పింఛన్ విధానాన్ని అమలు చేశాయి.

1920లోఅప్పటిబ్రిటీషు ప్రభుత్వంలో ఉద్యోగులకు ఉన్న కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కు బదులు ప్రత్యామ్నాయంగా DEFINED BENEFIT PENSION దేశంలో అమలులోకి వచ్చింది.

1957 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈ DEFINED BENEFIT PENSION తప్పనిసరి చేసినారు. తరువాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ DEFINED BENIFIT PENSION విధానాన్ని పాటించాయి.

1980 లో దశాబ్దాల పోరాటాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో AP REVISED PENSION RULES-1980 ను GO.NO:88, DT: 26-03-1980 ద్వారా వర్తింప చేశారు.

1981 లో కుటుంబ పెన్షన్ హక్కు సాధించబడింది.

17-02-1982 D.S.నకారా  VS. ది యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ Y.V. చంద్రచూడ్ ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. పెన్షన్ వాయిదా పడిన వేతనం.  ప్రభుత్వాలు ఇచ్చే దయా ధర్మం కాదు. అనేది దాని సారాంశం. గ్రాట్యుటీ 30-35 సంవత్సరాలు సేవ చేసినందులకు ఉద్యోగి సేవలకు యజమాని ఇచ్చే బహుమతి.

ఈ విధంగా అనేక కోర్ట్ తీర్పులు, ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యమాల ద్వారా పెన్షన్ లో ట్రిపుల్ బెనిఫిట్ స్కీం సాధించబడినది.

ట్రిపుల్ బెనిఫిట్ స్కీం అంటే:

1) పెన్షన్

2) గ్రాట్యుటీ

3) కమ్యూటేషన్

1957 నాటి DEFINED BENEFIT PENSION నుంచి 1982 నాటి TRIPLE BENEFIT SCHEME కు రావటానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఉద్యోగులు చేస్తున్న నిరంతర పోరాటాల ద్వారా ఇలాంటి చరిత్ర పునరావృతం కావాలని ఆశిస్తూ…. 1983 నుండి ఏటా డిసెంబరు 17న 'పెన్షనర్స్ డే'గా జరుపు కొంటున్నాం. పెన్షన్ కు భారతదేశంలో దగ్గర దగ్గరగా 160 ఏళ్ళ చరిత్ర వుంది.

రిటైర్మెంట్ అనంతర జీవనం కోసం తమ రిటైర్డ్ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని ఆనాటి వలస ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా భారత పెన్షన్ చట్టం, 1871 ద్వారా ఈ వ్యవస్థ రూపుదిద్దుకొంది.  ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పెన్షన్ను అప్పుడప్పుడు పెంచుతూ నాటి బ్రిటీషు ప్రభుత్వం పరిహారం కల్పించేది.

రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం అందజేస్తున్నప్పటికీ 1922, జనవరి 1 నుండి అమలులోకి వచ్చిన ఫండమెంటల్ రూల్స్లో వాటిని పొందుపర్చలేదు. రక్షణమంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా వున్న  శ్రీ డి ఎస్ నకారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్  ఆడిట్ అండ్ అక్కౌంట్స్లో ఒక ఆఫీసర్గా 1972లో రిటైరయ్యారు. మిగతా పెన్షనర్లలాగే ఆయనకూడా పెన్షన్ పొందటంలో అనేక ఇబ్బందులలను ఎదుర్కొన్నారు. అందువల్ల ఆయన సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అప్పటి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి  శ్రీ యశ్వంతరావు చంద్రచూడ్-   ఫిర్యాదుదారు, ప్రభుత్వ వాదనలను విన్నారు. ''పెన్షన్'' అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితంకాదని, అది సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించి రిటైరైన ప్రభుత్వోద్యోగి హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పారు. తన ఉద్యోగులు రిటైరైన తరువాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు 1982 డిసెంబరు 17 న వెలువడింది.

ఆ కారణంగానే డిసెంబరు 17న దేశమంతటా 'పెన్షనర్స్ డే'  (పింఛనుదార్ల దినోత్సవం) గా పాటిస్తున్నారు.

సుప్రీమ్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం పెన్షన్ ను పెన్షనర్ హక్కుగా పరిగణించబడింది. అది పెన్షనర్  గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు సరిపడునంతగా వుండాలి.

'నకారా కేసు' లో సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనల ప్రాతిపదికగా ఐదవ కేంద్ర వేతన సంఘం ''పెన్షన్ అన్నది బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్ అన్నది వారి చట్టబద్ధమైన, 

అన్యా క్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది. అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్ ని కూడా నిర్ధారిస్తూ, సవరిస్తూ, మార్పులు చేర్పులు చేయాల్సి వుందని" పేర్కొంది.

భారతదేశంలో ఇటీవల చోటు చేసుకొంటున్న పెన్షన్ సంస్కరణలు

పిఎఫ్ ఆర్డి ఎ (పెన్షన్ ఫండ్ క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) బిల్లు, ప్రపంచబ్యాంకు పెన్షన్ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

పెన్షన్ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చినది, ప్రస్తుతమున్న పెన్షన్ స్థానంలో కంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలన్నది. ఈ పెన్షన్ స్కీం అమలు జరుపుతున్న దేశాలలో చిలీ, స్వీడన్, పోలెండ్, మెక్సికో, ఆస్ట్రేలియా, హంగరీ, కజకిస్థాన్ వంటి దేశాలున్నాయి.

భారత ప్రభుత్వం ప్రధానంగా చిలీ పెన్షన్ సంస్కరణ పథకం పట్ల మరింతగా ఆకర్షితురాలైంది.

2004, జనవరి 1నుండి కేంద్రప్రభుత్వ సర్వీసులలో చేరే నూతన ఉద్యోగులకు పిఎఫ్ఆర్డిఎ బిల్లు ద్వారా నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది అమలులో వున్న కంట్రిబ్యూటరీ యేతర డిఫైన్డ్ బెనిఫిట్ పథకానికి బదులు డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రతిపాదిస్తోంది. దీని క్రమబద్ధీకరణ నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పిఎఫ్ఆర్డిఎ) చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డిఎ పై 10శాతం చెల్లిస్తే, అంతే మొత్తం ప్రభుత్వం జమచేస్తుంది.

బ్యాంకులలో 2010 ఏప్రియల్ 1 న, లేదా ఆ తరువాత చేరిన ఉద్యోగులు, అధికార్లకు ఈ స్కీం వర్తింపజేయబడుతోంది. ఈ ఉద్యోగులకు వేరేగా మరెలాంటి ప్రావిడెంట్ ఫండ్  PF లేదు. ఈ ఉద్యోగ వ్యతిరేక పెన్షన్ ఫండ్ బిల్లు (పిఎఫ్ఆర్డిఎ)ను పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఈ విశేష హక్కును కేంద్రప్రభుత్వం లాక్కొన్నట్లైంది. ఈ కొత్త పెన్షన్ పథకంలో ఉన్నవారి పెన్షన్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇది ప్రయివేటు మదుపుదార్ల, షేర్ మార్కెట్ ప్రయోజనాలను కాపాడడానికే తప్పఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం సరిపడనిది.

ఈ సి పి యస్ పరిధిలో నేటికి 16.40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏపీ వారు దాదాపు 1.60 లక్షల మంది వున్నారు. ఈ సిపియస్ పధకం ప్రారంభమయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది చనిపోయారు. ఈ కుటుంబాలకు పెన్షన్ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రతి నెలా వేతనం, కరువు భత్యం నుండి 10 శాతం చొప్పున మదుపు చేసిన పెన్షన్ ఫండ్ నుండి సీపీఎస్ రూల్ ప్రకారం క్లైమ్ చేసుకోవాల్సిన 60 శాతం సొమ్ము కూడా సకాలంలో రాక ఆ కుటుంబాలు అనేక అవస్థల పాలవుతున్నాయి. పాత పెన్షన్ పథకం వారికి గ్రాట్యుటీ సదుపాయం వుండటం వలన చనిపోయిన లేదా రిటైరైన ఉద్యోగి కుటుంబానికి గరిష్టంగా రూ.12 లక్షల వరకు లభించేది. సీపీఎస్లో గ్రాట్యుటీ అవకాశం లేకపోవటం వలన ఆ కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంది. పెన్షన్ కాదది వంచనగా రుజువైంది. పాత పెన్షన్ పథకం కంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే లాభదాయకంగా వుంటుందనే పాలకుల మాటలు పచ్చి అబద్ధాలు అని తేలిపోయింది.

సీపీఎస్ ప్రమాదం తేటతెల్లమవుతున్న కొద్దీ ఉద్యోగుల్లో అభద్రత, ఆందోళన పెరుగుతోంది. దానితో సీపీఎస్ కి వ్యతిరేక ఉద్యమాలు ఊపందు కుంటున్నాయి. సీపీఎస్ చందా దారులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేక సంఘాలుగా సమైక్యమై నిరంతర పోరాటాలు చేస్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన 7 రోజులలో రాష్ట్రంలో సి పి యస్ రద్దు చేస్తామని చెప్పి అధికాంలోకి వచ్చి దాదాపు 3సంవత్సరాలయినా కమిటీలతో రేపుమాపని కాలయాపన చేయడం, కొత్త కొత్త రుట్ మ్యాప్ లను ప్రకటించడం జరిగి నేడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో మోసానికి ఉద్యోగులను గురిచేసేలా సిపియస్ కు బదులుగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేపేరు మార్చి ఏమార్చాలనుకుంటుంది. ఆ దిశగా మంత్రులకమిటినీ వేసి ఉద్యోగ సంఘ నాయకులను సమావేశపరచి ఒప్పించాలనుకోవడం ఖచ్చితంగా CPS ఉద్యోగులను మోసం చేయడానికే అని అర్ధం అవుతుంది.

  *సీపీఎస్ ని  రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అనుమతించకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వరకే అంగీకరించటం వలన ఫలితం ఉండదు. తద్వారా ఉద్యోగుల ఉద్యమాలు శాంతిస్తాయని పాలకులు భావిస్తే అది వారి భ్రమ. రెండేళ్ల్ల నుండి సీపీఎస్పై పోరాటాలు దేశవ్యాపితంగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకో జూస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా! అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పెన్షన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అనే విషయాన్ని ఏమార్చలేవు.

భారతదేశంలో ప్రస్తుతం 60 ఏళ్ళ పైబడినవారు 8 శాతానికి మించి వున్నారు. అంటే సుమారు 10 కోట్లమంది. ఈ సంఖ్య 2050 నాటికి 21 శాతానికి అంటే 33.6 కోట్లకు చేరుకొంటుంది. మనదేశంలోని 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికి -  వారు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకొనేవారు కావచ్చు. లేదా ఇళ్ళల్లో పనిచేసే ఇంటిపని వారలు కావచ్చు - ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్ సాధించాల్సి వుంటుంది. వారంతా వయసులో వున్నంతకాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడిన వారే. అంటే ఇప్పుడు పెన్షనర్ల పెన్షన్ ను పరిరక్షించడం, పెన్షన్ లేనివారికి పెన్షన్ కల్పించడమే మనముందున్న బృహత్తర కర్తవ్యం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top