ఆకలేస్తోందమ్మా..! ప్రభుత్వ బడుల్లో ‘పది’ విద్యార్థులకు అల్పాహారం కరవు
జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ‘పది’ విద్యార్థులకు నాలుగురోజుల నుంచి అధ్యయన తరగతులు కొనసాగుతున్నాయి. వాటికి కాలే కడుపులతోనే విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 8నుంచి 9 గంటలు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు వాటిని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో స్టడీ క్లాసులు జరుగుతున్నాయి. జిల్లాలోని 448 పాఠశాలల్లో 28596మంది విద్యార్థులున్నారు.
వేలమంది విద్యార్థులు అధ్యయన తరగతుల్లో ఓపిగ్గా కూర్చొని వినటానికి, చదువుకోవటానికి అల్పాహారం ఎంతైనా అవసరం. కానీ ఆ విషయాన్ని జిల్లా విద్యాశాఖ విస్మరించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్కు ప్రజాపత్రినిధులతో కూడిన పాలకవర్గం ఉంది. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు అప్పటి జడ్పీ ఛైర్పర్సన్ అనూరాధ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఒక రోజు ఉప్మా, మరో రోజు పల్లీ ఉండలు, ఉడికించిన గుడ్లు, బిస్కెట్ ఫ్యాకెట్లు, శనగలు, అలసందలు, పెసర గుగ్గిళ్లు వంటివి అందజేసేవారు. పిల్లలు హుషారుగా తరగతులకు హాజరయ్యేవారు. ప్రస్తుతం జిల్లాలో ఆపరిస్థితి లేదు. కొందరు ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని ఆయా గ్రామాల పెద్దలతో వాటిని సమకూర్చుకుంటున్నారు. 95 శాతానికి పైగా పాఠశాలల్లో అల్పాహారం లేకుండానే తరగతులు కొనసాగుతున్నాయి. డీఈఓ మాత్రం అన్ని పాఠశాలల్లో కచ్చితంగా సాయంత్రం 4-5.30 గంటల మధ్య స్టడీ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. మే 3 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు ఈ క్లాసులు కొనసాగించాలని సర్క్యులర్ జారీ చేసి దులిపేసుకున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. కొన్ని పురపాలికల పాఠశాలలకు మాత్రం మున్సిపల్ కమిషనర్లు పురపాలక సాధారణ నిధుల నుంచి ఖర్చు పెడుతున్నారు.
అంచనాలు రూపొందించాలని ఆదేశించాం :
ఈ సమస్యను ‘న్యూస్టుడే’ జిల్లాపరిషత్తు ఛైర్పర్సన్ ఉప్పాల హారిక వద్ద ప్రస్తావించగా డీఈవో, సీఈవోలను సమాచారం అడిగారు. ఇటీవల జరిగిన జడ్పీ స్టాండింగ్ కమిటీలో పది విద్యార్థులకు అల్పాహారం గతంలో ఎలా అందించారు. వాటి వివరాలు కోరారు. గత పద్ధతినే కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీఈవోను ఆదేశించానని ఆమె వివరించారు. త్వరలో అల్పాహారం అందిస్తామన్నారు.
0 Post a Comment:
Post a Comment