పిల్లల్ని బడికి రప్పించడానికి ఆ ఉపాధ్యాయిడి వినూత్న ప్రయత్నం.
ఎవరికైనా సమస్యలు ఉంటే, సాధారణంగా వారు అధికారులకు లేదా ప్రజా ప్రతినిధులకు తమ సమస్యలను పరిష్కరించమని వినతిపత్రాన్ని సమర్పిస్తారు.
కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రం పిల్లల్ని బడికి పంపమని తల్లి తండ్రులకు వినతిపత్రాలని సమర్పిస్తున్నారు.
వివరాలలోకి వెళ్తే, కృష్ణా జిల్లా, తిరువూరు మండలం, గానుగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు యం.రాం ప్రదీప్ బడికి సక్రమంగా రాని విద్యార్థులని బడికి రప్పించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
తరచుగా తల్లి తండ్రులకు ఫోన్ చేయడం, విద్యార్థుల ఇళ్లకు వెళ్లడం, ప్రభుత్వం అందించే పథకాలు గురించి వారికి వివరించడం,సెలవు రోజుల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి మార్గాల ద్వారా పిల్లలని బడికి రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఆయన విజ్ఞప్తి మన్నించి చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలను బడికి సక్రమంగా పంపిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసి నప్పటికీ, కొంత మంది విద్యార్థులు బడికి సక్రమంగా రావడం లేదు.
అటువంటి విద్యార్థులని కూడా బడికి రప్పించడానికి ఆయన ఒక వినూత్న మార్గం ఎంచుకున్నారు.ఒక వినతిపత్రాన్ని తయారుచేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.
పిల్లలని బడికి సక్రమంగా పంపాలని, వారిని పనులకు పంపవద్దని, ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేయవద్దని,ప్రభుత్వం అందించే సదుపాయాలని వినియోగించుకోవాలని ఆయన వినతిపత్రం ద్వారా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆయన ప్రయత్నాన్ని చూసి కొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు.గతంలో కూడా దాదాపు 100మంది బడిబయటి పిల్లలని గుర్తించి,వారిని ఆయన వివిధ పాఠశాలల్లో చేర్పించారు.
కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది విద్యార్థులు రెండేళ్లుగా చదువుకు దూరం అయ్యారని,విద్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని,తన వంతు ప్రయత్నంగా విద్యార్థులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు,తన ప్రయత్నానికి తోటి ఉపాధ్యాయుల సహకారం కూడా ఉందని,ప్రస్తుతం ఆ పాఠశాల కు తాత్కాలిక ఇంచార్జ్ ఉన్న ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
0 Post a Comment:
Post a Comment