సరోగసీలోనూ ప్రసూతి సెలవులు... : హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
సరోగసీ (అద్దె గర్భం) విధానంలోనూ మహిళలు ప్రసూతి సెలవులకు అర్హులేనని ఏపీ హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బీవీవీడీ కిరణ్మయి(48) సరోగసీ విధానంలో గతేడాది డిసెంబరు 29న ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. పిల్లల ఆలనాపాలన నిమిత్తం మెటర్నటీ లీవ్ కోసం దరఖాస్తు చేశారు. ఈ తరహా దరఖాస్తు తొలిసారి రావడం, ఈ అంశంపై నిర్ణయం ప్రభుత్వ విధివిధానాల పరిధిలో లేకపోవడంతో అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో కిరణ్మయి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది కె.వి.శేషగిరిరావు వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. తన పిల్లల ఆలనాపాలన చూడాల్సిన అవసరం తల్లిగా ఆమెకు ఉందని, వెంటనే ఆమెకు మెటర్నటీ లీవ్ మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య 6న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మంజూరు చేసే సెలవులు కోర్టు తుదితీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
0 Post a Comment:
Post a Comment