ఉద్యమాలపై నిఘా నేత్రం - నిరసనల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు ఫోన్లు
కేసులు అవసరమా అంటూ పరోక్ష బెదిరింపులు.
ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న సంఘ నేతలు.
13న భేటీలో ఐక్య ఉద్యమ కార్యాచరణ: ఫ్యాప్టో
ఉపాధ్యాయ సంఘాల ఆందోళనల్లో పాల్గొనే ఉపాధ్యాయులపై నిఘా పెట్టారు. కిందిస్థాయి నేతలకు కూడా ఫోన్లుచేసి నిరసనల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవడం అవసరమా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఫిట్మెంట్, సీపీఎస్ రద్దు, పాఠశాలల విలీనం తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలన్నీ రెండురోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. యూటీఎప్, ఏపీటీఎఫ్, ఏపీటీఎఫ్-1938, ఎస్టీయూఏపీ తదితర సంఘాలన్నీ నిరసనల్లో పాల్గొన్నాయి. కొన్ని సంఘాలు పాత తాలూకా కేంద్రాల్లో, కొన్ని సంఘాలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశాయి. రాబోయే రోజుల్లోనూ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించాయి. ఇదే సమయంలో ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాల నుంచి కొందరు ఉపాధ్యాయులకు ఫోన్లు వెళ్లాయి. ‘‘ఏమిటీ... ఫలానా నిరసన కార్యక్రమానికి వెళ్తున్నారా? కేసులు పెట్టించుకోవడం, స్టేషన్ల చుట్టూ తిరగడం అవసరమా?’’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. ‘‘డిమాండ్ల సాధన కోసం చేయక తప్పదు. సంఘంలో ఉన్నప్పుడు వెళ్లాల్సిందే కదా’’ అని ఎవరైనా అంటే.. ‘‘అయితే నిరసనల్లో పాల్గొంటారన్నమాట!’’ అంటూ నర్మగర్భంగా ముగిస్తున్నారు.
ఈ బెదిరింపులు మండల స్థాయిలో ఉన్న ఉపాధ్యాయ నేతలకూ వెళ్లాయని సమాచారం. అయితే ఇటువంటి వాటికి బెదిరేది లేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(ఫ్యాప్టో)లో ఉన్న సుమారు 10 ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఇకపై విడివిడిగా కాకుండా అన్నీ సంఘాలు కలసి ఉద్యమించాలని నిర్ణయించాయి. ఫ్యాప్టోలో ఉన్న సంఘాలతో పాటు కలిసొచ్చే ఇతర సంఘాలు, నేతలతో ఈ నెల 13న మరోసారి సమావేశమై తుది చర్చ అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని సమాఖ్య నేతలు పేర్కొన్నారు.
కిందిస్థాయి నుంచి ఒత్తిళ్లు ఉపాధ్యాయ సంఘాలపై కింది స్థాయి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అనివార్యంగా సంఘాలు ఉద్యమంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు నేతలు లోపాయికారీగా పేర్కొంటున్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఐఆర్ కంటే తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చినా సంఘాలు మాట్లాడకుంటే ఎలా అని ఉపాధ్యాయుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటనతో నిరాశ నెలకొన్న నేపథ్యంలో సంఘాలు పోరాడాల్సిందేనని గట్టిగానే అంటున్నట్లు సమాచారం. కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాక... ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులపై భారం పెరిగిందనే అసంతృప్తి ఉంది. ప్రాథమిక పాఠశాలల విలీనం, ఉపాధ్యాయులపై యాప్ల భారం, టీచర్ల కొరత, ఉన్నతాధికారుల తీవ్ర నియంత్రణ... ఇవన్నీ వారిలో అసంతృప్తి రగిల్చాయి. చివరకు తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలను ఉద్యమించాలని ఒత్తిడి చే సే పరిస్థితికి తెచ్చాయని అంటున్నారు.
0 Post a Comment:
Post a Comment