అర్హత ఉన్నా అందదేమో...?
సాంకేతిక సమస్యతో నమోదు కాని వివరాలు
అమ్మఒడిపై ఆందోళనలో విద్యార్థులు
అమ్మఒడి పథకం ఈసారి ఎంతమందికి వర్తిస్తుందో.. ఎన్ని వేలమంది అనర్హులు అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేయడంతోపాటు హాజరు నమోదుకు ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తెచ్చారు. అందులో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు చేయలేక పోతున్నారు. దీంతో వేలాదిమంది అమ్మఒడి పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నారు.
చర్యల్లేవు :
ప్రభుత్వం నవంబరు 8 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు 130 రోజులు పని దినాలు ఉంటాయని, వీటిలో 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి అందిస్తామని ప్రకటించడంతోపాటు విద్యార్థుల హాజరు నమోదుకు స్టూడెంట్ అటెండెన్స్ మొబైల్ అనే అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చారు. అన్ని యాజమాన్యాల్లో పాఠశాలల్లోనూ విద్యార్థుల హాజరు ఈ యాప్లో నమోదు చేయాల్సి ఉంది. వివిధ సాంకేతిక సమస్యల కారణంగా విద్యార్థుల హాజరు నమోదు కావడం లేదు.ఈ సమస్యను ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రత్యేకంగా హాజరు నమోదు కోసం ఒకరిని కేటాయించి విద్యార్థుల వివరాలను యాప్లో నమోదు చేయిస్తున్నారు. సాంకేతిక సమస్యలతో చరవాణులు పుచ్చుకుని సిబ్బంది కుస్తీపడుతున్నారు.
పత్రాలు అందించినా...
ప్రస్తుత సమస్యల కారణంగా వేలాదిమంది అమ్మఒడికి అర్హత కోల్పోయే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరంలో 5.75లక్షలకుపైగా విద్యార్థులను అర్హులుగా గుర్తించినా చాలామంది వివిధ కారణాలతో లబ్ధి అందక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 1.31లక్షలమంది అనర్హుల జాబితాలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. వారందరికీ అర్హత నిర్ధారించుకోవడానికి అవసరమైన పత్రాలు అందించాలని చెప్పారు. అలా చాలామంది పత్రాలు అందించినా ఇప్పటికీ అమ్మఒడి జమ కాలేదు.
నిబంధన తొలగిస్తేనే సాయం :
కొవిడ్ మూడోదశ హెచ్చరికల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మళ్లీ రెండు నెలలపాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలన్న విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థులు అందరికీ అమ్మఒడి సాయం అందాలంటే నిబంధనలు తొలగించాల్సిన అవసరం ఉందని, ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
హాజరు నమోదుకు అవస్థలు :
యాప్లో హాజరు నమోదుకు సాంకేతిక సమస్యల కారణంగా ఉపాధ్యాయులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఈ సమస్యను సంఘపరంగా ఉన్నతాధికారులకు చెప్పాం. బడికి వచ్చినా విద్యార్థి హాజరు నమోదు కాకపోతే ప్రభుత్వం నిర్ధేశించిన 75శాతం హాజరు రాదు. మాన్యువల్గా వేసిన హాజరును పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. - ఎ.సుందరయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
అందరికీ అందాలి :
అమ్మఒడి సాయం అర్హులైన విద్యార్థులందరికీ అందాలి. గతేడాడి ఈ పథకం వర్తించని వేలమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ తిరుగుతున్నారు. వారికి రావాల్సిన మొత్తాన్ని అందించాలని సంఘ పరంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించాం. యాప్ హాజరునే ప్రామాణికంగా తీసుకుంటే 50శాతం వరకు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.
- టి.నాగరాజు, ఏపీటీఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి
0 Post a Comment:
Post a Comment