పీఆర్సీ కమిషన్కు విలువేదీ? నివేదికనూ బయటపెట్టలేదు.. అధ్యయనానికి సీఎస్ కమిటీయా?
అమలు చేయనప్పుడు ఇంత కసరత్తు ఎందుకు
ప్రభుత్వంపై భగ్గుమంటున్న ఉద్యోగులు
పీఆర్సీ కమిషన్ విషయంలో జగన్ సర్కారు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేయడంతో పాటు, దానిపై అధ్యయనానికి సీఎస్ నేతృత్వంలో కమిటీ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన విలువ ఇదేనా అని నిలదీస్తున్నారు. సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదికకే ప్రాధాన్యం ఇస్తూ ఉద్యోగుల హక్కులను సర్కారు కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను పట్టించుకోకుండా, కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టకుండా రివర్స్ పీఆర్సీ అమలు చేసి చేతులు దులుపుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్ కమిటీ సిఫారసులను అమలు చేసి 13లక్షల మంది ఉద్యోగుల కుటుంబాల్లో ప్రభుత్వం అసంతృప్తి మిగిల్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు కమిషన్కు సిబ్బంది, మౌలిక వసతుల కల్పనకు రూ.కోటికి పైనే ఖర్చు అయి ఉంటుందని, ఆ కమిషన్ పీఆర్సీపై సుదీర్ఘ కసరత్తు చేసి, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి సమగ్రంగా ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిషన్ నివేదికను అమలు చేయనప్పుడు ఇంత సుదీర్ఘ కసరత్తు ఎందుకని ఉద్యోగులు నిలదీస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను జగన్ సర్కారు బయటపెట్టలేదు. కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఉద్యోగులు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటున్నారు. అశుతోష్ మిశ్రా కమిషన్ కూడా ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా సిఫారసు చేసి ఉండదని, అందుకే ఆ నివేదికను బయటపెట్టకుండా సీఎస్ కమిటీ పేరిట డ్రామా నడిపిన ప్రభుత్వం... తాను ఇవ్వాలనుకున్న ఫిట్మెంట్నే ఫిక్స్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
0 Post a Comment:
Post a Comment