అసంబద్ధ పిఆర్సిపై కదంతొక్కిన ఉద్యోగులు - పిడిఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు
అసంబద్ధ పిఆర్సికి వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మంగళవారం కదం తొక్కారు. భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశారు. పిఆర్సిపై ఇచ్చిన చీకటి జిఒలను రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమీషన్ రిపోర్టును బహిర్గతం చేయాలని, దీని ఆధారంగా న్యాయబద్ధమైన పిఆర్సిని ప్రకటించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. సెలవు పెట్టి మరీ ఆందోళనకు రావడంతో పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉద్యోగులులేక వెలవెలబోయాయి.పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, సిఐటియు, ఎఐటియుసి, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద రోడ్డుపై ఒక వైపు మాత్రమే నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించారు. ఇంకోవైపు రోడ్డుపై మోకాళ్ల మీద బైఠాయించి నిరసన తెలిపిన యుటిఎఫ్ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లేపేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధరాులో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సాగుతున్న పోరాటంలో పిడిఎఫ్ ముందుభాగాన ఉంటుందన్నారు. నిర్బంధాలను ఎదుర్కొనడానికి, అవసరమైతే జైళ్లకెళ్లడానికి కూడా తాము వెనుకాడబోమని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ధరాులో పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిఆర్సి ఉద్యమం చరిత్రలో ఎనుడూ లేనివిధంగా సుమారు 13 లక్షల మంది ఉద్యోగులందరూ విశాల ఐక్యంతో ఏకతాటిపైకి వచ్చి నిర్వహిస్తోను పోరాటానికి ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగాల్సి రావడానికి ప్రభుత్వమే కారణమన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వరరావు ప్రసంగించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద బహిరంగ సభలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఉద్యోగుల పోరాటానికి అండగా నిలుస్తారని, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాని, అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని అన్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పాల్గొని మద్దతు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, కడప కలెక్టరేట్లు ధర్నాలతో హోరెత్తాయి.
0 Post a Comment:
Post a Comment