నూతన విద్యా విధానం ప్రమాదకరం : ఐఫ్యాక్టో నేతల ఉద్ఘాటన
ఎస్వియు క్యాంపస్ : నూతన విద్యా విధానం-2020 వలన దేశానికి ప్రమాదం పొంచి ఉందని అఖిలభారత విశ్వవిద్యాలయాల, కళాశాలల అధ్యాపకుల సంఘం అభిప్రాయపడింది. అఖిల భారత విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపక సంఘాల 31వ జాతీయ కాన్ఫరెన్స్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో రెండవ రోజైన శనివారం 'జాతీయ విద్యా విధానం-2020' అనే అంశంపై చర్చగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమబంగా, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపక సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ చర్చాగోష్టికి కేరళ రాష్ట్రం అధ్యాపకుల సంఘం సమన్వయకర్త సి.పద్మనాభన్ అధ్యక్షత వహించారు. ఆ సంఘం ఎపి రాష్ట్ర మహిళా ప్రతినిధి డాక్టర్ సృజన మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వలన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రమాదం పొంచి ఉందని ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో అనేక మంది విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించకుండా ఆన్లైన్లో క్లాసులు బోధించడం సమంజసం కాదని తెలిపారు. మహారాష్ట్ర్ర మహిళా ప్రతినిధి డాక్టర్ మధు పరాంజేపే మాట్లాడుతూ.. కీలకమైన విద్యారంగానికి నేటి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం వల్ల ప్రపంచస్థాయి పోటీల్లో మనదేశ విద్యార్థులు రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నూతన విద్యా విధానం, ప్రస్తుత విద్యా విధానం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపకుల సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కేశవ భట్టాచార్య, కార్యదర్శి అరుణ్ కుమార్, తమటం రామచంద్రారెడ్డి, సదస్సు నిర్వాహకులు రత్న ప్రభాకర్, చంద్రశేఖర్, వేణుగోపాల్, సదస్సు ప్రధాన సలహాదారులు తమటం రామచంద్రారెడ్డి, గౌరవ సలహాదారులు సాగం నాగరాజు, అధ్యాపక సంఘాల నాయకులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment