ఆందోళన వీడండి - చర్చలకు రండి: ఐదుగురు సభ్యులతో కమిటీ
పీఆర్సీ అంశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు తమకు సమ్మతం కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టి... ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు సాధనా సమితి పేరుతో ఉమ్మడి ఎజెండా ద్వారా పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణ యించాయి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడ కుండా జీఓలను అమలు చేయాలని ట్రెజరీ కార్యాలయాలకు సర్కులర్ జారీచేసింది. అంతేగాకుండా శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన పీఆర్సీజీవోలను కూడా ఆమోదించారు. ఈ అంశంపై కేబినెట్లో సుమారు అరగంట సేపు చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలావుండగా, ఉద్యోగులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేసేందుకు ముఖ్యమంత్రి ఐదుగురు సభ్యులతో కమిటీని నియామకం చేశారు. కమిటీలో సభ్యులుగా సీఎస్ డా. సమీర్ శర్మ, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వున్నారు. వీరు ఉద్యోగ సంఘాల నేతల తో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, ముందుగా జీవోలను వెనక్కి తీసుకున్న తర్వాతనే చర్చలకు వస్తామని ఉద్యోగసంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. అదీ కూడా ముఖ్య మమంత్రితోనే చర్చలకు వస్తామని.. అధికారులతో ఇక చర్చించే ప్రశ్నే లేదని అంటున్నారు. మొత్తంగా ప్రభుత్వం ఉద్యోగులను చల్లబరిచేందుకు తాము చేయగలిగిన ప్రయత్నం తాము చేస్తున్నామన్న అభిప్రాయం కల్పించేందుకు కమిటీ ప్రయత్నిస్తోంది.
0 Post a Comment:
Post a Comment