జీతాలు, పింఛన్లు పూర్తిగా అందనే లేదు : కొత్త ఏడాదిలో తొలిరోజు కొందరు ఉద్యోగులకే జమ
ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరం తొలి రోజున జీతాలు, పింఛన్లు ఉద్యోగులకు పూర్తిగా అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇతర ఉద్యోగులకు అక్కడక్కడ మాత్రమే వారి ఖాతాలకు జీతాలు జమ అయ్యాయి. తమకు పింఛను అందిన దాఖలా లేదని ఆ సంఘాల నాయకులు చెబుతున్నారు. రెండో తేదీ ఆదివారం కావడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వద్ద తగినంత నిధులు ఉంటే ఆదివారం కూడా పింఛన్లు, జీతాలు జమ చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశాలూ తక్కువేనని సమాచారం. చాలినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, పెన్షనర్లను ఇదే సమస్య వెన్నాడుతోంది. ఆఖరికి ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇవ్వాలనేది తమ డిమాండ్లలో ఒకటిగా చేర్చాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. జీతాల కోసం రూ.4,000 కోట్లు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల కోసం రూ.1,500 కోట్లు ప్రతి నెలా అవసరమవుతాయని లెక్క. శనివారం మధ్యాహ్నం వరకు కూడా తమకు జీతాలు, పింఛన్లు అందకపోవడంతో కొందరు ఉద్యోగుల మధ్య చర్చ జరిగింది. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయ ఉద్యోగులు కొందరికి, జిల్లాల్లో ప్రభుత్వశాఖల్లో కొందరు ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి.
ఎప్పుడు అందుతాయోనని ఆందోళన :
అసలే సంక్రాంతి పండుగ రోజులు. జీతాలు, పింఛన్లు ఎప్పుడు అందుతాయోనని ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. జనవరి 4న నిర్వహించే వేలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ఈ నేపథ్యంలో శనివారం సాగిన కొన్ని చెల్లింపులు మినహాయిస్తే మరో రూ.4,500 కోట్ల వరకు ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపులకు అవసరమవుతాయని అంచనా. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు సీఎఫ్ఎంఎస్ నుంచి ఈ-కుబేర్కు చేరినా అక్కడి నుంచి తదుపరి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. జనవరి ఒకటిన చాలామందికి పింఛన్లు అందలేదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆదివారం అందేలా ఏర్పాట్లు చేయాలని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర వీరయ్య కోరారు.
0 Post a Comment:
Post a Comment