AP PRC Issue : ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం సీరియస్... ఛార్జీ మెమోలు జారీ
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్సీ వివాదం (PRC Issue) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వున్న పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ప్రకారమే కొత్త జీతాలను ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి వుంది. ఈ క్రమంలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది. ఇటీవల ప్రకటించిన పీఆర్పీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తుంటే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రాసెస్ చేయవద్దని కోరుతున్నాయి. ఈ క్రమంలో మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ట్రెజరీ ఉద్యోగులు పంతానికి పోవడంతో సర్కార్ సీరియస్ అయ్యింది. వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా మొండికేస్తున్న అధికారులకు ప్రభుత్వం చార్జ్ మెమోలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 27 మంది డిడి, ఎస్టీఓ, ఏటిఓ లకు మెమోలు జారీచేసారు. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు చెందిన ముగ్గురు డిడి లతో పాటు వివిధ జిల్లాలకు చెందిన 21 మంది సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏ టి ఓ లకు ఛార్జ్ మెమోలు జారీ అయ్యాయి. నూతన పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకు వీరికి మెమోలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఇదిలావుంటే ట్రెజరీ అధికారులకు ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. లాగిన్లో ఉన్న వేతన బిల్లులు అన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించింది. ఇవాళ(సోమవారం) సాయంత్రం లోపు వేతన బిల్లులు అన్నింటినీ ప్రాసెస్ చేయాలని పేర్కొంది.
0 Post a Comment:
Post a Comment