ఉపాధ్యాయ బదిలీలు మరింత జాప్యం - ముఖ్యమంత్రి వద్ద దస్త్రం పెండింగ్ - సాధారణ బదిలీలపై కమిటీ ఏర్పాటు
బదిలీల కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. పాఠశాలలు తెరిచే ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి, అధికారులు తెలిపినా అది మాత్రం జరిగే పరిస్ధితి కనిపించడం లేదు. బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికి అనేక సార్లు వినతిపత్రాలు అందించాయి. దీనిపై స్పందించిన సంబంధిత శాఖ 20 రోజుల క్రితమే దస్త్రాన్ని ముఖ్యమంత్రి వద్దకు చేర్చింది. అక్కడ ఆమోదం లభించకపోవడంతో పాటు సాధారణ బదిలీలలో పారదర్శకత కోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ బదిలీలు ఏ విధంగా జరపాలో నివేదిక ఇవ్వనుంది.
ప్రత్యేక మార్గదర్శకాలు :
సాధారణ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు ఉపాధ్యాయులకు వర్తించవు. వీరికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించి బదిలీలు చేస్తుంటారు. 2017 ఆగస్టులో బదిలీలు జరగగా, గత రెండేళ్లుగా వివిధ కారణాలతో వాయిదా పడుతోంది. ఈ వేసవిలో ఉంటాయని ఆశించినా.. కొవిడ్-19 ప్రభావంతో వాయిదా పడ్డాయి. ఉపాధ్యాయుల బదిలీలకు ముందు హేతుబద్ధీకరణ జరగాల్సి ఉంటుంది. హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టడమంటే తేనె తుట్టెను కదపటమేనని సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని తెలపటంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాలలుండవు :
తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థుల నమోదుతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 20లోపు విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులుంటారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 462 ఏకోపాధ్యాయ, 84 బోధకులు లేని పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులను నియమించనున్నారు.
సెప్టెంబరు 5న ప్రారంభమయ్యేనా..?
పాఠశాలల పునఃప్రారంభంలోపు బదిలీలు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి అనేక సార్లు తెలిపారు. ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మొదట్లో కొంత సమాచారం మండల అధికారుల నుంచి సేకరించిన విద్యాశాఖ ప్రస్తుతం వాటిపై దృష్టి సారించడం లేదు. సెప్టెంబరు 5న పాఠశాలల ప్రారంభం ఉండకపోవచ్చని, అందుకే బదిలీలపై కొంత తాత్సారం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. అయినా ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
భిన్నాభిప్రాయాలు :
ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే చేపట్టాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరంలో ఒక త్రైమాసికం పూర్తయిందని, మరో నెల రోజుల్లో పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాని సందర్భంలో వచ్చే వేసవిలోనే మాన్యువల్గా కౌన్సెలింగ్ జరిపితే మంచిదని కొంత మంది ఉపాధ్యాయులు రాష్ట్ర నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.
మూడేళ్లుగా ఎదురుచూపులు :
మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. ప్రస్తుత తరుణంలో కొవిడ్-19 వల్ల చాలా మంది ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బదిలీలు వాయిదా వేస్తారనుకోవటం లేదు. ఎస్జీటీలకు డివిజన్ స్థాయిలో బదిలీలు జరిగేలా చూడాలి.
0 Post a Comment:
Post a Comment