సనాతన ధర్మంలో రెండు మార్గాలున్నాయి. ఒకటి పితృమార్గం. మరొకటి పునర్జన్మరహితమార్గం. వీటినే దక్షిణాయనం, ఉత్తరాయణాలు అని అంటారు. ప్రాణుల్లో కోటిమందికి ఒకరికి మాత్రమే జన్మరాహిత్య మోక్షం ఏర్పడుతుంది. వారు మాత్రమే ఉత్తరమార్గంలో ప్రయాణించగలరు. మిగిలిన ఒకరు తక్కువగా కోటి మందీ తిరిగి జన్మించే పితృయానంలోనే ప్రయాణిస్తారు. ఈ విధమైన పునర్జన్మ రహితమైన మార్గం లభించే వరకూ అంతా పునరపి జననం, పునరపి మరణం అంటూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాలి.
మళ్ళీమళ్ళీ పుట్టే వీరంతా చంద్రుని ఆశ్రయించి ఉంటారు. చంద్రుడు జనన మరణ వృద్ధి క్షీణతలను మానవులకు ప్రతి రోజూ గుర్తు చేస్తూ ఉంటాడు. అమావాస్యనాడు అదృశ్యమై తరువాత మొదలయ్యే శుక్లపక్షంలో క్రమంగా వృద్ధిపొందుతూ పౌర్ణమి నాడు పరిపూర్ణుడు అవుతాడు. ఆ తరువాత మరలా క్షీణస్తూ అమావాస్యనాడు అదృశ్యం అవుతాడు. కనుక మరణం ఉన్న మానవులకు ప్రాతినిధ్యం వహించే వాడు చంద్రుడు.
పితృదేవతలు చంద్రుని ఆశ్రయించి ఉంటారు కనుక వారిని సౌమ్యులు అని అంటారు. సౌమ్యులు అనే పదం సోముని నుంచీ వచ్చింది. సోమ అనే శబ్దం దేవతలు సేవించే సోమరసానికి చెందింది. ఇది వారికి ఆకలి దప్పికలు లేకుండా చేస్తుంది. మానవులు తమ తల్లితండ్రులకు తిలతర్పణాలు ఇస్తూ ఉంటే అవి స్వధామాత ద్వారా సోమరసంగా సౌమ్యులకు చేరుతుంది. ఇది ప్రతి దినం చంద్రుని చేరుతూ ఉంటుంది. చంద్రునికి చేరుతున్న సోమరసం చంద్రునిలో వృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. ఈ విధంగా చంద్రుని చేరిన సోమరసాన్ని పితృదేవతలు సేవిస్తూ ఉంటారు. చంద్రునిలో కలిగే కళల కారణం చేత ఈ సోమరసం పౌర్ణమి తరువాత తగ్గిపోతూ వచ్చి అమావాస్యకు సంపూర్ణంగా ఖాళీ అవుతుంది. ఆ సమయంలో పితృదేవతలు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. కనుక ఈ సమయంలో ప్రతీ హిందువూ తిలతర్పణాలు విడువాలని ఈ విధంగా విడిచిన తర్పణాలను స్వధామాత వారికి చేరవేసి వారికి సోమరసం లేని కొరత తీరుస్తుందని వేదాలు చెబుతున్నాయి.
అమావాస్య నాడు తమకు కలుగుతున్న నిరాహారం (ఆహారం లేకపోవడం) తప్పించుతున్న పుత్రులు, మనుమలకు పితృదేవతలు కోరుకున్న కోరికలు తీర్చడమే కాకుండా, సకల ఐశ్వర్యాలూ ఇస్తారు. కనుక ప్రతీ అమావాస్య నాడూ పితరులు తమ వారసుల నుంచీ ఇన్ని నువ్వులూ నీళ్ళ కోసం ఎదురు చూస్తారు. కనుక మున్సిపల్ కుళాయిలోని ఇన్ని నీళ్ళు, పదిపైసల నువ్వులతో కలిపి విడువ లేని వారికంటే దరిద్రులు ఈ భూమి మీద ఉండరు. అమ్మానాన్నలకు ఇన్ని నీళ్ళు వదలని వారిని దేవతలు తమ గుడి మెట్ల ముందు బిచ్చగాడిగా చూస్తారు. తిలతర్పణాలు వదిలేవారికి ఎదురు వెళ్ళి వివిఐపి దర్శనం చేయించి ప్రసాదఫలాలుపుణ్యాలు ఇస్తారు.
ముక్కోటి దేవతలూ తీర్చలేని కోరికలు కూడా పితృదేవతలు తీరుస్తారు. మనం మాత్రమే అర్చించవలసిన తాతముత్తాతలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
0 Post a Comment:
Post a Comment