‘చలో విజయవాడ'కు మద్దతు' : ఉద్యోగుల పోరాటానికి అండగా వామపక్ష విద్యార్థి సంఘాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివర్స్ పిఆర్సికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటానికి వామపక్ష విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఎస్ఎఫ్ఎస్ఐ, ఎఐఎస్ఎఫ్, పిడిఎస్టియు రెండు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్న కుమార్, అశోక్, జాన్సన్, శివారెడ్డి, రవిచంద్ర, రామ్మోహన్, రామకృష్ణ, గనిరాజు శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే క్రమంలో ఉద్యోగులకు 27 శాతం ఫిట్మెంటు ఇస్తామని హామీ ఇచ్చి... పిఆర్సిని తగ్గించడం అన్యాయమని విమర్శించారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకుండా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికార వైసిపి ప్రయత్నిస్తున్నాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఉన్నతాధికారుల ద్వారా బెదిరింపులు, ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు బనాయించి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం పిఆర్సి జిఓలను వెంటనే ఉపసంహరించుకుని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
0 Post a Comment:
Post a Comment