ఉద్యోగులూ ఆలోచించండి - పీఆర్సీపై వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వాదన : తమ పరిధిలోని 50 కుటుంబాల గ్రూపులో పోస్ట్ చేయాలని ఆదేశం
కొత్తగా ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల్లో కోత పడదని ముఖ్యమంత్రి జగన్ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని, విలేకర్ల సమావేశంలో మంత్రి పేర్ని నాని పీఆర్సీపై వెల్లడించిన వివరాలతో కూడిన పోస్టులు వాలంటీర్లకు చేరాయి. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ (ఎఫ్వోఏ) సంస్థ వాలంటీర్లకు ఈ పోస్టులు పంపింది. తమ పరిధిలోని 50 కుటుంబాలు ఉన్న గ్రూపులో వీటిని పోస్టు చేయాలని వాలంటీర్లకు ఎఫ్వోఏ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రూపుల్లో వీటిని వాలంటీర్లు పోస్ట్ చేస్తున్నారు.
‘ఉద్యోగులూ ఆలోచించండి’ పేరుతో 8 రకాల పోస్టులు :
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఏమేం చేసింది... విభజన సమస్యలతోపాటు కొవిడ్ పరిస్థితులతో రాష్ట్ర సొంత ఆదాయం తగ్గిందని, కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల్లో కోత అవాస్తవమని, ఈ పీఆర్సీతో జీతాల ఖర్చు పెరుగుతుందనే ప్రభుత్వ వాదనతో కూడిన 8 పోస్టులను వాట్సప్ గ్రూపుల్లో పంపుతున్నారు. ‘ఉద్యోగులూ ఆలోచించండి’ పేరుతో ఈ పోస్టులు వాలంటీర్లకు చేరాయి. ఎఫ్వోఏ సంస్థకు చెందిన ఎమ్ఎల్వోలు వీటిని పంపించారు. ఇవే కాకుండా పీఆర్సీపై పార్టీ అభిప్రాయంగా ఉన్న 12 పేజీల నోట్ను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విటర్లోనూ వీటిని పంపిస్తున్నారు.®️
0 Post a Comment:
Post a Comment