ఉపాధ్యాయులకు టీకా - వివరాల సేకరణలో విద్యాశాఖ వర్గాలు
జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతమంది టీకా వేయించుకున్నారు? వారిలో 45 ఏళ్ల లోపు వారెందరు? ఆ పైబడిన వారు ఎంతమంది? ఇంకా టీకా వేయించుకోని వారి వివరాలను అందజేయాలని జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయకుండా స్కూళ్లు తెరవటం ప్రమాదకరమని, ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో దానిపై ప్రభుత్వాన్ని అఫడవిట్ దాఖలు చేయాలని సూచించటంతో ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ ఈ వివరాలు కోరింది. జిల్లాలో 3750 ప్రభుత్వ పాఠశాలల్లో 13 వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 4.50 లక్షలమంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు మరో వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిల్లో 4 వేల మంది ఉపాధ్యాయులు, 2 లక్షలమంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులను ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించకపోవటంతో ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా ప్రత్యేకించి వారికి టీకాలు వేయలేదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లా విద్యాశాఖకు అందిన సమాచారం మేరకు 40 శాతం మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారని చెబుతున్నారు. వీరిలో అందరూ రెండు డోసులు వేయించుకోలేదు. కొందరు ఒక డోసు వేయించుకోగా మరికొందరికి రెండు డోసులు పూర్తయ్యాయని విద్యాశాఖకు తెలియజేశారు. ఉన్నత పాఠశాలల్లో 45 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా ఉండటంతో వారికి 50 శాతం అయి ఉంటుందని, వీరిలో ఒకడోసు వేయించుకున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ఇక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో 45 ఏళ్ల లోపు వారే ఎక్కువ. దీంతో ఈ పాఠశాలల్లో కనీసం 25 శాతం కూడా కాలేదని సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరందరికి రెండు డోసులు పూర్తి కావాలంటే ఆగస్టు 16 లోపు అసాధ్యామని అంటున్నారు. ప్రస్తుతం అంతపెద్ద సంఖ్యలో టీకా నిల్వలు లేవు. అవి జిల్లాకు చేరుకుని ఉపాధ్యాయులను ప్రత్యేకంగా పిలిపించి వేయటానికి కనీసం వారం, పది రోజులైనా పడుతుందని వైద్యవర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టీకాలు వేయలేదని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. తాజాగా వారికి టీకాలు వేయాలని కూడా ప్రత్యేకంగా ఉత్తర్వులు రాలేదని చెప్పారు. టీకాల విషయంలో శాఖాపరంగా చర్యలు శూన్యమని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బసవలింగారావు, ప్రధానోపాధ్యాయుల సంఘం నేత తిరుమలేశు తెలిపారు.
0 Post a Comment:
Post a Comment