Monday 19 July 2021

ఆధార్‌లో చిరునామా మార్పు సులభమే - ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ గోపాలన్‌.

ఆధార్‌లో చిరునామా మార్పు సులభమే - ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ గోపాలన్‌.

గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణతోనూ మార్చుకోవచ్చు..




ఆధార్‌ కార్డులో చిరునామ మార్పులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిందని ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎస్‌.గోపాలన్‌ చెప్పారు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణ పత్రం ద్వారా చిరునామాను మార్చుకోవచ్చని వివరించారు. ‘‘గెజిటెడ్‌ అధికారి సంబంధిత వ్యక్తుల చిరునామాను ధ్రువీకరిస్తూ లేఖ ఇస్తే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. రేషన్‌కార్డు, వంట గ్యాస్‌ బిల్లు, అద్దె ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పందం పత్రం (రెంటల్‌ అగ్రిమెంట్‌)ను కూడా ఆమోదిస్తున్నాం’’ అని వివరించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ఆధార్‌ వ్యవహారాలను పర్యవేక్షించే ఆయన బెంగళూరు నుంచి ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


ప్రశ్న: స్వీయ ధ్రువీకరణతో చిరునామాలో మార్పులకు అవకాశం ఉందా?

జవాబు: సాధ్యం కాదు. దరఖాస్తులో పేర్కొనే చిరునామాకు మద్దతుగా చెల్లుబాటు అయ్యే పత్రం లేదా ఎలక్ట్రానిక్‌  ధ్రువీకరణ అనివార్యం.


ప్రశ్న: ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ వంటి సవరణలు చేసుకోవటం కష్టంగా ఉందని ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకని?

జవాబు: మీరు చెబుతున్నంత సమస్య ప్రస్తుతం లేదు. సులువుగా సవరణలు చేసేందుకు సౌలభ్యాలను కల్పించాం. ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు లేదా ఆధార్‌ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చు. సమీపంలో ఉన్న బ్యాంకుల్లో సదుపాయం అందుబాటులో ఉంది. స్త్రీ,శిశు సంక్షేమ, పాఠశాల శాఖల్లోనూ అవకాశం కల్పించాం. సెల్ఫ్‌ సర్వీస్‌ అప్‌డేట్‌ పోర్టల్‌(ఎస్‌ఎస్‌యూపీ) ద్వారా చేసుకోవచ్చు.


ప్రశ్న: అనుసంధానం ఎంత వరకు ఉపయుక్తంగా ఉంటోంది?

జవాబు: ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయటం ద్వారా గణాంకాల్లో స్పష్టత వస్తోంది. మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారిని గుర్తించేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో కార్డులు జారీ చేయటం ప్రయోజనకరంగా ఉంది. ఆదాయ పన్నుతో లింకు చేయటంతో సరైన పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రశ్న: ఆన్‌లైన్‌లో సవరణలను అనుమతించినా సమాచారం రావటం లేదన్న ఫిర్యాదులొస్తున్నాయి కదా?

జవాబు: కార్డుదారులు అవసరానికి మించిన సమాచారాన్ని నమోదు చేస్తే ఇబ్బందులొస్తాయి. గతంలో నమోదు చేసిన సమాచారానికి ప్రస్తుత నమోదుకు వ్యత్యాసం ఉంటే అనుమతించకపోవచ్చు.


ప్రశ్న: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆధార్‌ నమోదు ఎలా ఉంది?

జవాబు: 2020 డిసెంబరు నాటికి తెలంగాణలో 3.95 కోట్ల మందికి ఆధార్‌ కార్డులను జారీ చేశాం. రాష్ట్ర జనాభా 3.85 కోట్లు. ఉపాధి, విద్యా అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి సంఖ్య అధికంగా ఉండటంతో ఇక్కడ కార్డుల జారీ సంఖ్య ఎక్కువుంటుంది. ఏపీ జనాభా 5.39 కోట్లుంటే, 4.9 కోట్ల మంది కార్డులు పొందారు. రెండు రాష్ట్రాల్లోనూ 0 నుంచి 18 సంవత్సరాల వయసు వారు కార్డులు పొందాలి.


ప్రశ్న: ఆధార్‌ వ్యవస్థ దేశంలో ఎలాంటి మార్పు తెచ్చింది?

జవాబు: విప్లవాత్మక మార్పులకు ఆధార్‌ శ్రీకారం చుట్టింది. వంద కోట్ల మందికిపైగా ఆధార్‌కార్డులు పొందారు. ఇంతకు ముందు నిర్దిష్టంగా ఒక గుర్తింపు కార్డు అనేది దేశంలో లేదు. రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు గుర్తింపు కార్డు ఇలా అనేకం ఉన్నా వాటి పరిధి పరిమితంగానే ఉండేది. ఆధార్‌ వచ్చిన తరవాత అన్నింటికీ ఆధార్‌ ప్రామాణికంగా మారటమే కాకుండా ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు, సబ్సిడీలు అర్హులకే అందుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధార్‌తో అనుసంధానం చేయటం ద్వారా అర్హులందరికీ మేలు జరుగుతోంది.


ప్రశ్న: కార్డుల దుర్వినియోగంపై ఏమంటారు?

జవాబు: ఆధార్‌కార్డుల నమోదు, సవరణలు, ధ్రువీకరించటం వరకే యూఐడీఏఐ బాధ్యత. నమోదు సమయంలో అన్ని రకాల జాగ్రత్తలను కేంద్రం తీసుకుంటోంది. విచారణ వ్యవహారాలు స్థానిక ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉంటాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top