Corona : నెగెటివ్ వచ్చినా... పాజిటివ్ వచ్చి కోలుకున్నా జాగ్రత్తగా ఉండాల్సిందే : హెచ్చరిస్తున్న నిపుణులు
First and Second Waves : చిన్నపాటి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా,కరోనా ఏమో అని భయపడి వెంటనే టెస్ట్ చేయించేసుకుంటున్నాం. రిపోర్టులో నెగిటివ్ వస్తే హమ్మయ్యా అంటూ ఊపిరితీసుకుంటున్నాం. అదే పాజిటివ్ వస్తే భయపడిపోతున్నాం. కానీ రిపోర్టు నెగిటివ్ వచ్చిందని రిలాక్స్ అయిపోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే కరోనా తీవ్రత అలా ఉంది. లక్షణాల్లోనూ సరికొత్త మార్పులు వస్తూండటంతో నెగిటివ్ వచ్చిందని అజాగ్రత్తగా ఉండొద్దని సూచిస్తున్నారు. గతంతో కరోనా తీవ్ర సమయం 1-2 వారాలు.. ఉంటే అదే ప్రస్తుతం కాలంలో 2-4 వారాలు ఉంటోంది. అదే పాజిటివ్ వచ్చి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక వ్యాధులు సోకుతుండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
కరోనా మహమ్మారి ఒక్కో వేవ్ కు ఒక్కోరకమైన మార్పులతో విరుచుకుపడుతోంది. పలురకాలుగా రూపుమార్చుకుంటోంది. దీంతో వ్యాధి లక్షణాలు, శరీరంపై తీవ్రత, దాని ప్రభావ కాలం..ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మొదటి వేవ్లో కనిపించిన లక్షణాలు ఇప్పుడు పెద్దగా కనిపించకుండానే బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కిడ్నీ, రక్త సంబంధ సమస్యలు ఎదురై కొంతమందికి అతి తక్కువ సమయంలోనే ప్రాణాల మీదకు వస్తోంది. మొదటి వేవ్లో 1 నుంచి 2 వారాలు మాత్రమే శరీరంలో వైరస్ ప్రభావం ఉండేది. అదే సెకండ్ వేవ్ లో 2 నుంచి 4 వారాల పాటు ఉంటూ కలవరపరుస్తోంది. అలాగే వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రశాంతంగా ఉండనివ్వటంలేదు. బ్లాక్, ఎల్లో, వైట్ ఫంగస్ లతో పరుగులు పెట్టిస్తోంది. ఈ సమ్యలతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా. మొదట్లో మైల్డ్, మోడరేట్, సీరియస్ పరిస్థితులు ఉండగా.. ఇప్పుడు నేరుగా మోడరేట్, సీరియస్ పరిస్థితులకు మారిపోయింది. ఇందుకు మహారాష్ట్ర వేరియంట్ ప్రధాన కారణమైతే, చేతులారా చేస్తున్న తప్పులు కూడా వైరస్ విజృంభణకు దోహదమవుతున్నదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రెండు వేవ్లకు చాలా తేడాలు...
మొదటి వేవ్లో కరోనా సోకినవాళ్లకు, సెకండ్ వేవ్ లో సోకినవారికి చాలా తేడా కనిపిస్తోంది. మొదటి కరోనాలో లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు ఉండేవి. వీటిని గుర్తించి వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే విషయం బయటపడేది. సెకండ్ వేవ్లో అలా లేదు. కొన్నిసార్లు అస్సలు లక్షణాలు కనిపించకుండానే దాడి చేస్తోంది. సాధారణంగా వైరస్ సోకిన నాటి నుంచి తీవ్ర ప్రభావం చూపే సమయానికి నాలుగు దశలు ఉంటాయి. ఇవి ఇంక్యుబేషన్, వైరీమియా, ఎర్లీ లంగ్, లేట్ లంగ్. ఇంక్యుబేషన్ 5 రోజులు ఉంటే, సెకండ్ వేవ్లో 3 రోజులకు, వైరీమియా 7 నుంచి 5 రోజులకు తగ్గింది.
ఇదీ చదవండి : వారికి ఇప్పుడు టీకా అవసరం లేదు.
దీంతో వైరస్ సోకినప్పటికీ లక్షణాలు గుర్తించే లోపు నేరుగా మూడో దశకు వెళ్లి ప్రాణాలమీదకు తెస్తోంది. సాధారణంగా కనిపించే లక్షణాలు సెకండ్ వేవ్లో కనిపించడం లేదు. కిడ్నీపై ప్రభావం మొదలైన దశ అంటే ఎర్లీ లంగ్, లేట్ లంగ్లో అసలు విషయం బయట పడుతున్నది. అందుకే రెండో వేవ్ వైరస్ను ముందుగా గుర్తించేందుకు ఇప్పుడు ర్యాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షల కంటే సీటీ స్కాన్పై వైద్యులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.ఆక్సిజన్ లెవల్స్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వేవ్లో వైరస్ ప్రభావం చాలా తీవ్రంగానూ, భిన్నంగా ఉంటోంది. ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్ఫెక్ట్ అయినా..లక్షణాలు బయట పడటంలేదు. దీంతో కరోనా సోకిందని తెలిసీ తెలియగానే చికిత్స చేయించుకునే సమయం కూడా లేకుండా రోగి చనిపోతున్నాడు. మరికొందరు పాజిటివ్ వచ్చి కోలుకున్నాక కూడా ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు చెందిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టటం..బ్లాక్ ఫంగస్ లు వంటి పలు రకాల ఫంగస్ లతో కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ ఫంగస్ లు డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువగా ఉంటున్నాయి. కోలుకున్నాక..ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
అనారోగ్యానికి దారి తీస్తున్న అంశాలు...
లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయటం సివియర్గా ఉంటే చూద్దాంలే అనే నిర్లక్ష్యం వెరసి ప్రాణాలు పోయేలా చేస్తున్నాయి. లేదా పాజిటివ్ రిపోర్టు వచ్చే వరకు జాగ్రత్తలు గానీ చికిత్స తీసుకోకపోవటం. లేదా సొంత వైద్యంతో స్టెరాయిడ్స్ వాడటం, వీటివల్ల బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతోంది. సాధారణ లక్షణాలు ఉండి ఇంట్లో చికిత్స పొందేవారు అప్రమత్తంగా ఉండాలి. నిజానికి లక్షణాల్లో తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి వారి సూచన మేరకు సూచించిన మందులను మాత్రమే వాడాలి.
కరోనా రోగులు సడెన్ గా చనిపోతుంటే ఏంటాని అనుకునేవాళ్లం. దానికి కారణం రక్తం గడ్డకట్టడమే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరణాల్లో 30 శాతం కంటే ఎక్కువ ఐసొలేషన్ పీరియడ్ తర్వాతే జరుగుతున్నట్టు మెడికల్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. పాజిటివ్ వచ్చి, 14 రోజులు ఐసొలేషన్ సమయం పూర్తిచేసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా చాలామందికి సడెన్ ఆక్సిజన్ లెవల్స్ డ్రాప్ అయిపోతున్నాయి. మరికొందరు హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. వైరస్ ఊపిరితిత్తులతో పాటు గుండె, కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి ప్రధాన అవయవాలపై దాడి చేస్తోంది. వైరస్ సోకిన తర్వాత ఇన్ఫెక్షన్ ప్రభావంతో ఈ అవయవాలు దెబ్బతిని ఐసొలేషన్ సమయం అనంతరం లక్షణాలు బయట పడుతున్నారని తెలిపారు. ఇలా నెగిటివ్ వచ్చినా రిలాక్స్ గా ఉండకుండా జాగ్రత్తలు తప్పనిసరి అని అలాగే పాజిటివ్ వచ్చి కోలుకున్నాక కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.ఎటువంటి తేడాలుకనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించా వారి సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి సూచించిన మందులు వాడాలి. ఏది ఏమైనా ఈ కరోనా కాలంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
0 Post a Comment:
Post a Comment