కరోనా సోకిన చిన్నారులకు కొత్త ముప్పు.
కరోనా సోకిక పిల్లలకు కొత్తముప్పు వాటిల్లుంది. కొన్ని వారాల వ్యవధిలోనే పలువురు చిన్నారులకు ఎంఐఎస్-సీ సోకుతుంది. కొన్ని రోజుల్లో ఈ కేసులు ఉద్ధృతంగా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎంఐఎస్-సీ అంటే ఎమిటి?, ఏ వయసు పిల్లలకు సోకుతుంది? వ్యాధి లక్షణాలు ఏంటి? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ).. కరోనా బారినపడిన పిల్లలకు పొంచి ఉన్న కొత్త ముప్పు ఇది. కొవిడ్ తగ్గిన తర్వాత కొన్ని వారాల వ్యవధిలో కొందరు పిల్లల్లో కనిపిస్తున్న తీవ్ర సమస్య ఇది. పిల్లల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, జీర్ణకోశం, చర్మం, కళ్లు... ఇలా వివిధ అవయవాలపై ఏకకాలంలో ప్రభావం చూపుతుంది. అందుకే దీన్ని మల్టీఆర్గాన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనీ అంటున్నారు. కరోనా మొదటిదశ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలు ఎంఐఎస్-సీతో ఆస్పత్రుల్లో చేరారు. మన దేశంలోనూ కొన్ని కేసులు వచ్చాయి. కరోనా రెండోదశలో పిల్లలూ ఎక్కువగా వైరస్ బారినపడుతున్నందున... కొన్ని రోజుల్లో ఈ కేసులు ఉద్ధృతంగా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు కరోనా మూడోదశలో ఎక్కువగా పిల్లలే వైరస్ బారినపడే అవకాశముందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నందున... ఇప్పటి నుంచే ఆసుపత్రుల్లో పిల్లల చికిత్సకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతోపాటు, ఎంఐఎస్-సికి చికిత్సలో వినియోగించే ఇమ్యునోగోబ్యులిన్ల వంటి ఔషధాలకు కొరత రాకుండా చూడాలని సూచిస్తున్నారు.
ఎంఐఎస్-సీకి కారణం...
కరోనా వైరస్ బారిన పడ్డ కొందరు పిల్లల్లో 2-6 వారాలకు ఎంఐఎస్-సి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో కరోనా చికిత్స పొందుతున్నప్పుడూ ఈ లక్షణాలు కనిపిస్తున్నా, చాలామంది కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాతే దీని బారిన పడుతున్నారు. ఓ మాదిరి నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలతో బాధపడ్డవారిలోనూ, అసలు ఏ లక్షణాలూ లేనివారిలోను (అసింప్టమాటిక్) కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అందుకే కొందరు పిల్లల్ని ఎంఐఎస్-సికి చికిత్స కోసం ఆస్పత్రులకు తీసుకెళ్లాకే... పరీక్షల్లో వారికి కొవిడ్ వచ్చి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. కరోనా సోకిన పిల్లలో... రోగనిరోధకశక్తి కాస్త ఆలస్యంగా, విపరీతంగా స్పందించడమే ఎంఐఎస్-సి సమస్యకు ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. వారిలో అవసరానికి మించి విడుదలవుతున్న యాంటీబాడీలు వివిధ అవయవాల్లో ఇన్ఫ్లమేషన్కు కారణమవుతున్నాయి.
0 Post a Comment:
Post a Comment