11 వ PRC ఎప్పుడో ? ఈ ఏడాదికి లేనట్లే...!
✔ మార్చి వరకు నివేదిక గడువు పొడిగింపు
✔ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో అసంతృప్తి
✔ ఉద్యోగులకు నెలకు రూ.4 వేల వరకు నష్టం
🔊 ఉద్యోగులను ఊరిస్తున్న 11వ పీఆర్సీ కమిషన్ నివేదిక మరోసారి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ గడువును పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కొత్త పీఆర్సీ 2019లో లేనట్లేనని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. గత ప్రభుత్వం 2018 మే 28న 11వ పీఆర్సీ కమిషన్ను నియమించింది. రెండు నెలలు ముందే అప్పటి ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసి విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రాను కమిషనర్గా నియమించింది. 2018 డిసెంబరులోపు నివేదిక అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి కూడా నివేదికలు అందుకున్నారు. 2018 నవంబరులో కమిషన్ నివేదిక అందుతుందని అందరూ భావించారు.
🔊 అయితే అప్పటి ప్రభుత్వం కమిషన్ నివేదిక సమర్పణ గడువును 2019 మే వరకు పొడిగించింది. 2019 మార్చి తరువాత కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం, తరువాత సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ అంశం తెరమరుగైంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 20 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ను ఖరారు చేసింది. ఏప్రిల్ నుంచి ఇది అమలులోకి వస్తుందని జూలైలో నగదు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం జూలై 1 నుంచి పీఆర్సీ ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్ - మధ్యంతర భృతి)ను 27 శాతంగా ఖరారు చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. దీంతో 20 శాతం చొప్పున మూడు నెలలకు 60 శాతం ఐఆర్ నష్టపోయారు.
🔊 ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ నివేదిక గడువును 2020 మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పీఆర్సీని అమలు చేస్తామని, ఉద్యోగులు సంతృప్తి పడే విధంగా పీఆర్సీని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తరువాత పీఆర్సీ గడువును పెంచడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
🍁 నష్టపోయిన విశ్రాంత ఉద్యోగులు
🔊 పీఆర్సీ ఖరారు కాకపోవడంతో ఇటీవల ఉద్యోగ విరమణ అయిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో నష్టపోయారు. 2018 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఉద్యోగ విరమణ అయ్యారు. సుమారు 20 నెలల పెరిగే వేతనాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. వీరు రూ.కోట్లలో నష్టపోయినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008 జూలై 1 నుంచి 2010 మార్చి 31 వరకు 9వ పీఆర్సీ అమలులోకి రాలేదు. అప్పట్లో 20 నెలల పెరిగిన వేతనం కోల్పోయారు.*
🍁 ఉద్యోగుల్లో ఆందోళన
🔊 కొత్త పీఆర్సీ అమలులోకి రాకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నెలకు సుమారు రూ.4 వేల చొప్పున నష్టపోతున్నారు. 11వ పీఆర్సీ నివేదిక 2018 డిసెంబరులో రావాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించింది. కొత్త పీఆర్సీ ఎప్పుడు అమలులోకి వస్తుందో తెలియడంలేదు.
0 Post a Comment:
Post a Comment