తరలిస్తే అదనపు గదులేవీ ? ఉన్నవారికే సరిపోని పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్న ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను తరలింపుతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులు, సరైన మౌలిక వసతులు లేకపోవడమే ఇందుకు కారణం. నూతన వ్యవస్థలో భాగంగా 3, 4, 5 తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్కు తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. హడావుడిగా ప్రభుత్వం ఈ విధానం ప్రకటించేందే తప్ప విద్యార్థులకు సరిపడ తరగతి గదులు, ఆట స్థలాలు ఉన్నాయా? విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయానే ఆలోచన చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3, 4, 5, తరగతులు చదివే పిల్లలు 2019-20 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం సుమారు 22 లక్షల మంది ఉన్నారు.
వీరంతా 35 వేల ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు. ఇప్పుడు వీరిని రాష్ట్రంలో ఉన్న 6 వేల ఉన్నత పాఠశాలలకు తరలించాలి. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూళ్లు ఎన్ని హైస్కూల్లో కలుస్తాయనే మ్యాపింగ్ను ప్రధానోపాధ్యాయులు చేస్తున్నారు. ఇది దాదాపు త్వరలో పూర్తవుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో ప్రాథమిక పాఠశాల నుంచి ఎంతమంది విద్యార్థులు హైస్కూల్కు వస్తారనే అంశాలను ఎలిమెంటరీ, హైస్కూల్ ఉపాధ్యాయులు లెక్కలు వేస్తున్నారు. 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు ఒక్కో పాఠశాలలో 20 నుంచి 60 వరకు ఉన్నారు. తరగతుల విభజన వల్ల 7 నుంచి 9 ఎలిమెంటరీ స్కూళ్ల విద్యార్థులు ఒకే హైస్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. సుమారు 200 నుంచి 300 మంది విద్యార్థులు ఒక్కో హైస్కూల్కు వెళ్లాల్సి ఉంటుందని ప్రధానోపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. అయితే వీరిని ఎక్కడ కూర్చొబెట్టాలనే అంశంపై ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న తరగతి గదులు సరిపోకపోవడంతో రెండు, మూడు సెక్షన్లు కలిపి కూర్చోబెడుతున్నారు. తరగతుల విభజన వల్ల కొత్తగా 200 మంది విద్యార్థులు చేరినా కనీసం ఏడు తరగతి గదులు అవసరమవుతాయని ప్రధానోపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ గదులను ఎలా సర్దుబాటు చేస్తారనే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల్లో నెలకొంది. సరిపడా గదులు లేకపోతే విద్యార్థులను చెట్ల కింద కూర్చొబెట్టే పరిస్థితులు తప్పవని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
గదుల నిర్మాణం లేని 'నాడు-నేడు'..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక్క తరగతి గదిని కూడా అదనంగా నిర్మించలేదు. బల్లలు, బోర్డులు, మంచి నీటి సదుపాయం.. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ వంటి 9 సదుపాయాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం మొదటి దశలో 15 వేల పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.4,600 కోట్లను ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు పెట్టినా కనీసం ఒక్క పాఠశాలలో కూడా అదనపు తరగతి గదిని నిర్మించలేదు.
0 Post a Comment:
Post a Comment