Sunday 30 May 2021

ఊపిరితిత్తులకు వైద్యుల్లేరు...!

 ఊపిరితిత్తులకు వైద్యుల్లేరు...!

Source : Andhra Jyothi , HYD



రాష్ట్రంలో పల్మనాలజిస్టులకు తీవ్ర కొరత సర్కారీ ఆస్పత్రుల్లో 100 మందిలోపే!.. రాజధానిలోని ఆస్పత్రుల్లోనే కరువుజిల్లాల్లో అయితే మరీ ఘోరం.. కొవిడ్‌ రోగులకు తీవ్ర ఇబ్బందులుశాశ్వత భర్తీపై దృష్టిపెట్టని సర్కారు.. కరోనా మూడో దశ వస్తే కష్టమే.  ఊపిరితిత్తులు మానవ శరీరంలో అత్యంత కీలకమైనవి. ఇవి దెబ్బతింటే ప్రాణాలకే ప్రమాదం. ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులపై కరోనా మహమ్మారి దాడి చేస్తోంది. తొలి దశలో ఈ ప్రభావం తక్కువగా ఉండగా.. రెండో దశలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పాజిటివ్‌ వచ్చి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండో దశలో వైరస్‌ యువతపైనే అధిక ప్రభావం చూపుతోంది. వైరస్‌ సోకిన రెండు మూడు రోజుల్లోనే కొందరికి లంగ్స్‌ దెబ్బతింటున్నాయి. ఆక్సిజన్‌ స్థాయులు హఠాత్తుగా పడిపోవడం, ఆ ప్రభావం గుండె, ఊపిరితిత్తులపై పడడంతో హఠాత్తుగా మరణిస్తున్నారు కూడా. ఇక కరోనా మూడో దశ కూడా వస్తుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలోనూ వైరస్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల చికిత్సకు పల్మనాలజిస్టులే కీలకం. మహమ్మారిపై పోరులో వారే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి అంతమయ్యే వరకు ఈ వైద్యుల అవసరం ఉంటుంది. కానీ, ప్రభుత్వాస్పత్రుల్లో పల్మనాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని సర్కారీ దవాఖానల్లో కలిపినా ఈ వైద్యులు మొత్తం వందమంది కూడా లేరు. హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రుల నుంచి జిల్లాల్లోని చిన్న ఆస్పత్రుల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పల్మనాలజిస్టులు కనీస సంఖ్యలోనూ లేరు. వారిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ప్రభుత్వాస్పత్రుల్లో మూడు నెలలు పనిచేసేందుకుగాను వైద్యుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానికి పల్మనాలజిస్టులెవ్వరూ స్పందించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు లక్షల్లో వేతనాలిస్తుండగా, సర్కారీలో అరకొరగా ఇస్తామంటున్నారు. దాంతో ఎవ్వరూ రావడం లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రిలో 3 నెలలు పనిచేసేందుకు పల్మనాలజిస్టు పోస్టులకు వాకిన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించగా ఒక్కరూ రాలేదు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తే వచ్చే అవకాశాలుంటాయి. కానీ, సర్కారు అటువంటి చర్యలేవీ చేపట్టలేదు. మూడో దశ ముప్పు ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం కీలకమైన వైద్యుల భర్తీపై దృష్టిపెట్టలేదు. తొలివేవ్‌లో కొవిడ్‌ సోకిన ప్రతి 100 మందిలో కేవలం 7.5 శాతం మందే ఆస్పత్రుల పాలయ్యారు. కానీ, సెకండ్‌ వేవ్‌లో మాత్రం అది 17 శాతంగా నమోదైంది. ఆస్పత్రుల పాలయ్యే వారిలో అత్యధిక మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి కేసుల్లో పల్మనాలజిస్టుల సేవలు ఎంతో అవసరం. ఊపిరితిత్తులకు చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయిన ప్రతి కొవిడ్‌ రోగులకూ పల్మనాలజిస్టులు ఇచ్చే సలహాలు, సూచనలు కీలకం.రాజధాని ఆస్పత్రుల్లోనే కరువు!హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రిలో 124 కొవిడ్‌ పడకలుండగా ఒక్క పల్మనాలజిస్టు పోస్టు ఉంది. అది కూడా ఖాళీ. గాంధీలోని ఒక యూనిట్‌ పల్మనాలజిస్టు విభాగంలో 15 మంది పనిచేస్తున్నారు. 1900 పైగా కొవిడ్‌ బెడ్లు ఉన్నాయి. పూర్తిగా కొవిడ్‌ చికిత్సలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితి దృష్ట్యా కనీసం మరో రెండు యూనిట్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో 350 కొవిడ్‌ పడకలు ఉన్నాయి. ఇక్కడ నలుగురు సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, మరో నలుగురు డిప్యుటేషన్‌ పల్మనాలజిస్టులు పనిచేస్తున్నారు. ఇక ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలో ఎక్కడికక్కడ సూపర్‌ స్పెషాలిటీతో ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. మూడు ప్రసూతి ఆస్పత్రులు, ఒక పిల్లల ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, సరోజిని కంటి  ఆస్పత్రి, ఉస్మానియా, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ సేవలు అందిస్తున్నారు. చెస్ట్‌ ఆస్పత్రి మినహా మిగతా చోట్ల పల్మనాలజిస్టులు లేరు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top