Black fungus : ఆందోళన వద్దు... అందరికీ రాదు
✔ 4 రోజుల్లో గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
✔ బ్లాక్ఫంగస్పై ఈఎన్టీ నిపుణులు డాక్టర్ మేఘనాథ్
కరోనా నుంచి కోలుకున్న తర్వాత 45 రోజులు దాటితే బ్లాక్ఫంగస్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువని ఈఎన్టీ నిపుణులు డాక్టర్ మేఘనాథ్ తెలిపారు. ప్రస్తుతం మ్యూకార్మైకోసిస్(బ్లాక్ఫంగస్)తో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. మధుమేహం అదుపులో పెట్టుకోవడం, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పకడ్బందీగా మాస్క్ ధరించడం ద్వారా దాదాపు బ్లాక్ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. జూన్ నెలాఖరుకు బ్లాక్ ఫంగస్ కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధి తీవ్రత.. లక్షణాలు.. జాగ్రత్తలకు సంబంధించి ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
* కరోనా నుంచి కోలుకున్నవారు తాము బ్లాక్ఫంగస్ బారిన పడతామేమో అని ఆందోళనకు గురవుతున్నారు. అందరికీ ఈ ముప్పు ఉండదు. అధిక మోతాదులో స్టిరాయిడ్లు వాడిన వారు.. మధుమేహం అదుపులో లేనివారు.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ముప్పు ఉంది. ఇలాంటి వారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత నెలన్నర రోజుల వరకు పకడ్బందీగా మాస్క్ ధరించాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇంట్లో ఉన్నా పెట్టుకోవాల్సిందే. * బ్లాక్ఫంగస్ బారిన పడితే దవడ, కన్ను, నోటి లోపాల భాగాలు తొలగించాల్సి ఉంటుందని బాధితులు భయపడుతుంటారు. అందరికీ ఇలాంటి అవసరం ఉండదు. లక్షణాలు గుర్తించిన 4 రోజుల్లో వైద్యులను సంప్రదిస్తే...ఎలాంటి ఇబ్బంది ఉండదు. మందులతోనే కోలుకుంటారు. 10 రోజులు దాటిన తర్వాత వస్తే ముప్పు పెరుగుతుంది.
* బ్లాక్ఫంగస్ లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. ముక్కులోపల, దవడ ఎముక, కంటిలోపల ఎప్పుడూ అనుభవించని నొప్పి కలుగుతుంది. అది తీవ్రంగా ఉంటుంది. అంగిలి పైభాగం నల్లగా మారుతుంది. ముక్కు నుంచి నల్లని ద్రావకం బయటకు వస్తుంది. కంటి కింద వాపు రావచ్ఛు ఈ లక్షణాలు ఉంటే మ్యూకోర్మైకోసిస్గా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కరోనా నుంచి కోలుకున్న తర్వాత నెలన్నర వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్డు, చేపలు తప్పనిసరిగా తీసుకోవాలి.
* కరోనా కారణంగా ఫంగస్ బారిన పడిన వారిలో రికవరీ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక సమస్యల కారణంగా బ్లాక్ఫంగస్ బారిన పడితే కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
0 Post a Comment:
Post a Comment