కరోనా నుండి కోలుకొన్నా కొన్ని లక్షణాలుంటాయ్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారితో పోరాడుతున్నవారికి కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కాస్తా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది. ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని పేర్కొంది. తగినంత గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.
హోం ఐసోలేషన్లో ఉన్నవారిలో జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భరించలేని గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే ముందే గుర్తించి, ఆలస్యం చేయకుండా దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలని కోరింది. అంతేకాకుండా ఇప్పటికే మహమ్మారి నుంచి కోలుకున్నవారు తమ అనుభవాలను చుట్టుపక్కల ప్రజలకు, మీడియాకు, స్థానిక నాయకులతో పంచుకోవాలని సూచించింది. తద్వారా కరోనాపై ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను నియంత్రించే అవకాశముందని కేంద్రం వివరించింది.
0 Post a Comment:
Post a Comment