పాత పెన్షన్ - కొత్త టెన్షన్ : రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చన్న కేంద్ర సర్కారు
● సీపీఎస్ను రద్దు చేసిన రాజస్థాన్ సర్కారు
● పాత పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం
● తెలంగాణ ఉద్యోగుల డిమాండ్కు బలం
● ఇక్కడా సీపీఎ్స రద్దు చేయాలని డిమాండ్లు
● కేంద్ర పరిధిలోనిదే: రాష్ట్ర ప్రభుత్వం
● రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చన్న కేంద్ర సర్కారు
● రాష్ట్రంలో 1.72 లక్షల సీపీఎస్ ఉద్యోగులు
● తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎ్స)ను అమలు చేస్తామంటూ రాజస్థాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన.. తెలంగాణలో ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడి ఉద్యోగులకు సీపీఎ స్ను రద్దు చేయాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంటోంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో 2004లో అమల్లోకి వచ్చిన నాటినుంచే సీపీఎ స్ను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనూ ఈ విషయం చెప్పారు.
కానీ, కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ను రద్దు చేసి, ఓపీఎ్సను అమలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని చెబుతోంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భిన్నమైన ప్రకటనలు వస్తుండగానే.. రాజస్థాన్ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఓపీఎ్సను అమలు చేస్తామని ఈ నెల 23న ప్రకటించింది. దీంతో సీపీఎస్ ను రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న విషయం స్పష్టమైనట్లయింది. రాజస్థాన్ ప్రభుత్వం చేసిన పనిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయడంలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 1.72లక్షల మంది ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ ను రద్దు చేయాలని కోరుతున్నాయి.
2004 నుంచి సీపీఎస్ అమలు...
సీపీఎస్ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా రగులుతూనే ఉంది. అప్పట్లో తొలుత కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ స్థానంలో ఉద్యోగుల చందా(కాంట్రిబ్యూషన్) ఆధారిత ‘నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎ్స)’ను అమల్లోకి తెచ్చింది. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. నాటి ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూ డా ఈ ఎన్పీఎస్ మాదిరిగానే రాష్ట్రంలో సీపీఎ్సను అమ లు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు 2004 సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీపీఎ్సను వర్తింపజేస్తూ 2004 సెప్టెంబరు 22న జీవో నంబర్ 653ను జారీ చేసింది. ‘ఆంద్రప్రదేశ్ పెన్షన్ రూల్స్-1980’ను సవరిస్తూ సీపీఎస్ ను అమల్లోకి తెచ్చింది. ఇది 2004 సెప్టెంబరు 1 తర్వాత ఉమ్మడి ఏపీలో నియమితులైన దాదాపు 10 వేల మందికి వర్తించింది.
2014లో రాష్ట్ర విభజన అనంతరం.. తెలంగాణలో సీపీఎ్సను అమలు చేస్తారా? లేదా? తెలపండంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలోని ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్పమెంట్ అథారిటీ(పీఎ్ఫఆర్డీఏ)’ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాష్ట్రాన్ని కోరారు.
దీంతో ఉమ్మడి ఏపీ అనుసరించిన సీపీఎస్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఏపీ జారీ చేసిన జీవోలో భాగంగానే ఉంటామని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్(డీటీఏ) కేంద్రానికి సమాధానమిచ్చారు.
దాంతో పెన్షన్ డబ్బును జమ చేసే ఎన్పీఎస్ ట్రస్టు - నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎ్సడీఎల్)తో ఒప్పందం చేసుకోవాలని డిప్యూటీ జనరల్ మేనేజర్.. రాష్ట్రానికి సూచించారు. దీంతో ట్రస్టుతో తెలంగాణ డీటీవో ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా కొత్త రాష్ట్రంలో కూడా సీపీఎస్ అమల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం 1.72 లక్షలకు పైగా ఉద్యోగులకు వర్తిస్తోంది. అయితే... రాష్ట్ర ఆవిర్భావం నుంచే సీపీఎ్సను రద్దు చేయాలంటూ ఉద్యోగుల నుంచి డిమాండ్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ సీపీఎస్ పేర సంఘాలు ఏర్పాటయ్యాయి.
ఓపీఎస్కు, సీపీఎస్కు ఇదీ తేడా...
ఓపీఎస్ కింద.. ఉద్యోగి రిటైరయ్యాక ప్రతి నెలా సర్వీస్ పెన్షన్ అందేది. అంటే.. ఉద్యోగి రిటైరైన చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతాన్ని సర్వీస్ పెన్షన్ కింద ప్రభుత్వం చెల్లించేది. ఒకవేళ పెన్షనర్ చనిపోతే.. అతని భార్యకు, ఆ తర్వాత వారిపై ఆధారపడే దివ్యాంగులైన, పెళ్లికాని పిల్లలకు పెన్షన్ అందేది. చివరి నెలలో రూ.50 వేల వేతనం ఉంటే... నెలకు రూ.25 వేల వరకు పెన్షన్ వచ్చేది. ఇది కుటుంబ పోషణకు, చరమాంకంలో పెన్షనర్లకు బాసటగా ఉండేది. కానీ, సీపీఎస్ లో ఈ సౌకర్యం లేదు. సీపీఎస్ అనేది ఉద్యోగి చందా ఆధారిత స్కీమ్. ఈ స్కీమ్ కింద ఉద్యోగుల మూలవేతనం, డీఏ(కరువు భత్యం)ల నుంచి ప్రతి నెలా 10 శాతం చొప్పున కట్ చేస్తారు. ప్రభుత్వం కూడా మరో 10 శాతం చందాను కలుపుతుంది. ఈ మొత్తాన్ని ఎన్పీఎ్స-ఎన్ఎ్సడీఎల్కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగి ‘పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్(ప్రాన్)’లో జమ చేస్తారు. దీనిని ఎన్ఎ్సడీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్యాంకులకు కు బదిలీ చేసి, అక్కడి నుంచి షేర్ మార్కెట్లో పెట్టిస్తారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అప్పటివరకు ప్రాన్లో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి ఉద్యోగికి 60 శాతం చెల్లించేస్తారు. మరో 40 శాతం సొమ్మును షేర్ మార్కెట్లోనే కొనసాగిస్తూ వచ్చే లాభ నష్టాలతో కలిపి ఎంతో కొంత ప్రతి నెలా పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. షేర్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాల ఆధారంగా ఉద్యోగికి పెన్షన్ వస్తుంది. అయితే దీని ద్వారా ఉద్యోగులకు ఒక్కోసారి రూ.2000, రూ.1000, రూ.1500 కూడా వచ్చిన సందర్భాలుంటున్నాయని వాపోతున్నారు. షేర్లు నష్టాల్లో కొనసాగితే పెన్షనర్ ఆ కాలమంతా మైన్సలోకి వెళుతున్నారని పేర్కొంటున్నారు. పెన్షన్ అందడం లేదంటున్నారు.
ఓపీఎస్తో ఎన్నో ప్రయోజనాలు...
ఓపీఎస్ కింద నిశ్చింతగా సగం వేతనం వచ్చేదని, ఉద్యోగులు చెబుతున్నారు. రిటైరయ్యాక... కమ్యూటేషన్ కింద ఒక ఉద్యోగికి ఓపీఎ్సలో కొన్ని సంవత్సరాల మొత్తం పెన్షన్ను అడ్వాన్సుగా పొందే వీలుండేది. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, ఫీజుల కోసం ఈ అడ్వాన్సులను తీసుకోవచ్చు. ప్రభుత్వం పలు దఫాలుగా పెంచే డీఏ, పీఆర్సీ ఫిట్మెంట్లు పెన్షనర్లకూ వర్తిసాయి. కానీ, సీపీఎస్ ఉద్యోగులకు ఇవేవీ వర్తించవు. ఒకసారి ప్రభుత్వంతో బంధం తెగిపోయిన తర్వాత పెన్షన్ కోసం షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులపైనే ఆధారపడాల్సి వస్తుంది.
ఇక రిటైర్ అయిన ఓపీఎస్ ఉద్యోగులకు ఇచ్చే రూ.16 లక్షల గ్రాట్యుటీ కూడా సీపీఎస్ ఉద్యోగులకు లేకపోగా ఇటీవలే ఉద్యోగులు పోరాడి దీనిని సాధించుకున్నారు. ఇన్ని రకాలుగా నష్టం కలిగిస్తున్న సీపీఎ్సను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కాగా, సీపీఎస్ ను అమలు చేయడం, రద్దు చేసుకోవడం రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద పలువురు ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పష్టతనిచ్చింది. తాము కేంద్ర ఉద్యోగుల కోసం ఎన్పీఎ్సను అమల్లోకి తెచ్చామని తెలిపింది. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలు మినహా ఈ కొత్త స్కీమ్(సీపీఎస్ లేదా ఎన్పీఎ్స)ను స్వచ్ఛందంగా అడాప్ట్ చేసుకుంటున్నామంటూ అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని చెప్పింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా అక్కడి సమాజ్వాది పార్టీ, బీఎస్పీ తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలలో పేర్కొన్నాయి. ఈ విషషయాన్నే తెలంగాణ ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు.
సీపీఎస్ను రద్దు చేస్తేనే మేలు దాముక కమలాకర్, తెలంగాణ సీపీఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘం నేతఒకే దేశం... ఒకే పెన్షన్ అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్మీవారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాంటప్పుడు ఉద్యోగుల విషయంలోనూ ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీపీఎ్సను రద్దు చేసి, ఓపీఎ్సను అమలు చేయాలి. ఉద్యోగులకు న్యాయం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడకూడదు. ఉద్యోగులకు పీఆర్సీ, సొంత జిల్లాలు కేటాయిస్తున్న ప్రభుత్వం సీపీఎ్సను రద్దు చేసి, మరో మేలు చేయాలి"
0 Post a Comment:
Post a Comment