పిఆర్సి సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా
పిఆర్సిపై మంత్రుల కమిటీతో జరిగిన చర్చలలో ఏ అంశాలపై చర్చించాలి, వేటిపై పట్టుబట్టాలి అనేది ముందుగా స్టీరింగ్ కమిటీలో నిర్ణయించుకున్న ప్రకారం చర్చలు జరుగలేదు. పిఆర్సి రిపోర్టు ఇవ్వకుండా,జిఓలు అబేయన్స్లో పెట్టకుండా చర్చలకు వెళ్ళకూడదు అనే నియమాన్ని సడలించి మరీ చర్చలకు వెళ్ళాం.మాకు భిన్నాభిప్రాయం ఉన్నా మెజార్టీ సభ్యులు చర్చలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని గౌరవించి చర్చలకు హాజరయ్యాము.
అయితే ఫిట్మెంట్, హెచ్ఐర్ఎ, గ్రాట్యూటీ, అడిషనల్ క్వాంటం పెన్షన్, సిపిఎస్ రద్దు లాంటి ముఖ్యమైన అంశాలపై తగినంతగా సాధన సమితి నాయకత్వం పట్టుబట్టలేదు. ముఖ్యంగా ఫిట్మెంట్కు సంబంధించి ఒక్క శాతంకూడా మెరుగుదల సాధించలేకపోయాం. ముఖ్యమంత్రిగారితో చెప్పుకునే అవకాశం కల్పించాలని అడిగినప్పుడు కనీసం మద్దతు పలుక లేదు.సిపిఎస్, గ్రాట్యూటీ, కాంట్రాక్టు ఉద్యోగులు, సచివాలయాల ఉద్యోగులు- ఇలా పలు ముఖ్యమైన అంశాలలో స్పష్టమైన నిర్ణయాలు రాబట్టలేక పోయాము.మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన వెంటనే జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాకు (ఎస్.టి.యు, యు.టి.ఎఫ్, ఎపిటిఎఫ్-1938) అంగీకారం లేదని మా అసంతృప్తిని స్పష్టంగా తెలిపాము.మా భిన్నా భిప్రాయాన్ని రికార్డు చేయమని కూడా కోరాము.మీరు అంగీకరించ నందునే మేము బయటకు వచ్చాము.
ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమావేశానికి హాజరైనట్లుగా అటెండెన్స్ షీట్లో మేము సంతకాలు చేసిన కాగితాన్ని చూపించి, మేము కూడా ఒప్పందాన్ని అంగీకరించినట్లు మీడియాలో చెప్పడం సరికాదు.ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఈ విధంగా వ్యవహరించడం తగదు.ఇది ప్రభుత్వ విశ్వసనీయతకే నష్టం. ప్రభుత్వం పిఆర్సి పై తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు,ఉపాధ్యాయులు అందరూ ఆమోదిస్తారని అనుకోవడం విజ్ఞత అనిపించుకోదు.
ఎంతో విశ్వాసంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు,కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సాధన సమితి ఇచ్చిన "ఛలో విజయవాడ" పిలుపును జయప్రదం చేశారు.పిఆర్సి సాధన సమితి నేతలు ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి ప్రభుత్వం దగ్గర అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు.లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రతినిధులుగా ఉన్న మేము తీవ్రంగా అభ్యంతరం చెప్పినా వాటికి విలువనివ్వలేదు.కనీసం ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రిగారితో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించలేదు.
కాబట్టి, ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడలేకపోయిన ఈ పిఆర్సి సాధన సమితి స్టీరింగ్ కమిటీకి మేము రాజీనామా చేస్తున్నాము.
సిహెచ్. జోసఫ్ సుధీర్ బాబు , ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు
కె.యస్.యస్.ప్రసాద్ , యుటియఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
జి.హృదయరాజు , ఏపిటిఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షులు
0 Post a Comment:
Post a Comment