అన్నీ మాయలే...
24వ తేదీన ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు.
అదే రోజు సాయంత్రానికే ప్రభుత్వం కొత్త జిల్లాల హడావుడి మొదలు పెట్టింది. 25వ తేదీ రాత్రి కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం పొందింది. తమకు అనుకూలంగా ఉన్న ఓ మీడియాకు ఆ నోట్లో ప్రస్తావించిన జిల్లాల పేర్లను లీక్చేసింది. ఆ మీడియా వాటిని అచ్చుపొల్లుపోకుండా ప్రచురించింది. అయితే... ముఖ్యమంత్రి సొంత మీడియా మాత్రం చివరి నిమిషంలో జరిగిన మార్పులను కూడా కలిపి, గెజిట్ నోటిఫికేషన్లలోని సమాచారాన్ని యథాతథంగా ప్రచురించడం విశేషం. బుధవారం రాత్రి పొద్దుపోయాక సీఎం జగన్మోహన్రెడ్డి ఆమోదం అనంతరం 26 జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్లను అప్లోడ్చేశారు. ఆ తర్వాతే అసలు విషయం బయటిచ్చింది. గెజిట్ విడుదలకు ముందు మంత్రివర్గం ఆమోదించిన జిల్లాల పేర్లలో మార్పులు చేశారని తేటతెల్లమైంది. అసలు ఇలా చేయవచ్చా.. ఇది నైతికమేనా? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘’ప్రభుత్వం తలచుకుంటే మంత్రివర్గం ఆమోదించిన ఏ డాక్యుమెంటునైనా మార్చవచ్చు. ఆ తర్వాత మరోసారి ర్యాటిఫికేషన్ తీసుకోవచ్చు. కానీ అదేదో ముందే చేసుకుంటే పారదర్శకంగా ఉండేది’’ అని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. తమకు పంపిన ఫైలులోని సమాచారం తెల్లారేసరికి చాలామటుకు మారిపోయిందని మంత్రులకు కూడా బోధపడింది. దీనిపై ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధాన ం ఇచ్చారు. ‘కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పేర్లే లేకపోతే ఎలా? అవి ఉండాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. అందుకే కొన్ని మార్పులు జరిగాయి’ అని ఆయన గురువారం నాటి విలేకరుల సమావేశంలో తెలిపారు.
0 Post a Comment:
Post a Comment