ఖజానా ఉద్యోగులు బిజీ బిజీ..! - జీతాల బిల్లుల తయారీలో తలమునకలు
జీతాల బిల్లుల తయారీలో ఆదివారం ఖజానా ఉద్యోగులు తలమునకలై ఉన్నారు. ఒకటో తేదీకల్లా ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు వేయాలి. దీంతో జనవరి జీతాలు ఇప్పటి వరకు జిల్లాలో 15వేల మందికి పైగా ఉద్యోగులు, 37వేల మంది పెన్షనర్లకు సంబంధించిన బిల్లులను తయారు చేయాల్సి ఉండడంతో ఆదివారం రాత్రికి కూడా కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి వచ్చినవి వచ్చినట్లు ధ్రువీకరించుకుని టోకెన్లు జనరేట్ చేయాలని మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఆయా శాఖల హెచ్ఓడీల నుంచి డీడీఓలపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒకవైపు సగటు ఉద్యోగి పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వారంతా కలెక్టరేట్ వద్ద జరగుతుతున్న ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వారిని పిలిస్తే ఎలా స్పందిస్తారో, పిలవకుండా జీతాల బిల్లులు తయారు చేయలేని పరిస్థితిలో డీడీఓలు కొట్టుమిట్టాడుతున్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం రాత్రికి ఖజానా, పోలీసు, రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు మాత్రమే ఖజానాలో పాసైనట్లు తెలుస్తోంది. కొత్త జీతాల ప్రకారం బిల్లులు వేస్తే ఊరుకునేది లేదని, తమకు అవి వద్దని ఉద్యోగులు ఇప్పటికే లేఖలు అందజేశారు. దీంతో డీడీఓలు సైతం బిల్లుల తయారీ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. పాత జీతాలు చేయటానికి వీల్లేకుండా సాఫ్ట్వేర్ను మార్చేశారు. ‘ప్రస్తుతం కొత్త జీతాలతో కూడిన సాఫ్ట్వేరే అందుబాటులో ఉంది. మాకు పాత జీతాలే ఇవ్వాలని లేఖలు ఇచ్చాం. ఇప్పటి వరకు ఉద్యోగుల జీతాల బిల్లులు జిల్లాలో 5 శాతం కూడా కాలేదు. ఏ ఉద్యోగి కొత్త జీతాలు తీసుకోవటానికి సుముఖంగా లేరని’ పీఆర్సీ సాధన సమితి నాయకుడు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు తెలిపారు. ఉద్యోగుల సమ్మతి లేకుండా చేసే బిల్లులకు డీడీఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఖజానా అధికారులు మాట్లాడుతూ 5వేల మంది ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను ఆదివారం రాత్రికి పాస్చేశామని తెలిపారు. 37 వేల మంది పెన్షనర్లకు ఇప్పటికే బిల్లులు జనరేట్ అయ్యాయని వివరించారు. దీన్ని మాత్రం ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి. అన్ని వేల మందికి బిల్లులు తయారు చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
0 Post a Comment:
Post a Comment