అమ్మ ఒడి ఏ దరికి...? వాయిదాతో కొత్త సందేహాలు...! - కోవిడ్ నేపథ్యంలో తగ్గుతున్న హాజరు. ఈ ఏడాదికి మినహాయించాలని వినతులు
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంతోపాటు డ్రాపవుట్లను తగ్గించడం, విద్యార్ధులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా 'జగనన్న అమ్మఒడి' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి కుటుంబంలోని ఒక విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున వారి తల్లి ఖాతాలో జమ చేస్తామని పేర్కొంది. అందులో భాగంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, మొదటి ఏడాది నగదు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలల్లో 'టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు గాను టాయ్ లెట్ మెయింట్ నెన్స్ ఫండ్ కింద ప్రతి విద్యార్థికి జమ చేసే రూ. 15 వేల మొత్తంలో రూ. వెయ్యి చొప్పున రూ.14 వేలు చొప్పున జమ చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ లాక్ డౌన్, కర్ప్యూల కారణంగా విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో కొనసాగలేదు. దీంతో విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తించాలంటే ఉండాల్సిన 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత పథకం వర్తింపు కోసం 75 శాతం హాజరు తప్పనిసరి అంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొద్ది రోజులుగా "కోవిడ్ కేసులు పెరగడంతో సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి హాజరు శాతం పూర్తి స్థాయిలో నమోదు. కావడం లేదు. మరోవైపు గతేడాది వరకు జనవరిలో జమ చేసిన "అమ్మ ఒడి' నగదు ను కూడా ఈ ఏడాది జూన్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
విద్యా సంవత్సరం ప్రారంభంలో...
అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి న సమయంలో ప్రతి ఏడాది జనవరి 26న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతే. కాకుండా కఠినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ పథకాన్ని అమలు చేసింది. అయితే గత రెండేళ్లు కరోనా కారణంగా 75 శాతం హాజరు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా కేసుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో తమ పిల్లలను బడులకు పంపలేకపోతున్నామని, కనుక ఈ ఏడాదికి కూడా హాజరు మినహాయింపు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే ఈ ఏడాది నుంచి జనవరిలో ఇచ్చే అమ్మ ఒడి జూన్లో ఇస్తారు. దీనితో 2021-22 జనవరిలో రావాల్సిన నిధులు 2022- 23 జూన్ నెలలో విడుదల చేస్తారు. జనవరిలో అమ్మఒడి ఇవ్వడం కొనసాగిస్తే.. 2022 జనవరి, 2023 జనవరి, 2024 జనవరి.. అంటే మూడేళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుందని, జనవరి నుంచి జూను మార్చడంతో 2022 జూన్, 2023 జూన్ రెండేళ్లే ఇస్తే సరిపోతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నాయకులు కూడా ఒక ఏడాది అమ్మ ఒడిని ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు చేస్తున్నారు.
పది పాసైన విద్యార్థులకు కాలేజీలో ఇస్తారా...?
అమ్మ ఒడిని పాత పద్ధతిలోనే అమలు చేస్తే.. ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా జనవరిలో డబ్బులు వచ్చేవి. కానీ.. దానిని జూన్క మార్చడంతో మార్చి- ఏప్రిల్లో పరీక్షలు రాసి పాఠశాలను వదిలిపెట్టే పదో తరగతి విద్యార్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పదో తరగతి విద్యార్థుల వరకు జనవరిలో ఇస్తారా? లేక.. టెన్త్ పూర్తయినప్పటికీ, కాలేజీలో చేరిన తర్వాత కూడా డబ్బులు ఇస్తారా అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని కోరుతున్నారు. కళాశాల విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలవుతున్న విషయం తెలిసిందే. వాటి షెడ్యూల్ మారకపోవడంతో పది నుంచి కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఒకే ఏడాది రెండు పథకాలు వర్తింపజేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సిన అవసరం ఉందని పేరెంట్స్ అసోసియేషన్ నేతలు కోరుతున్నారు.
0 Post a Comment:
Post a Comment