ఏపీలో తొలిరోజు 5 లక్షల మందికి టీకా
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు 5 లక్షల మంది బాలబాలికలకు టీకా పంపిణీ చేశారు. రాష్ట్రంలో సోమవారం నుంచి 15-18 ఏళ్ల బాలబాలికలకు ప్రారంభమైన తొలి విడత టీకా పంపిణీ ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది. కొవాగ్జిన్ టీకా పంపిణీ గ్రామ/వార్డు సచివాలయాల కేంద్రంగా జరుగుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మంది పిల్లలకు టీకా వేశారు. కృష్ణా జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి టీకా పంపిణీ ప్రారంభమైంది. రాత్రి ఏడు గంటల వరకు 64వేల మంది బాలబాలికలకు 1,285 సచివాలయాల కేంద్రంగా టీకా వేసినట్లు డీఎంహెచ్ఓ సుహాసిని వెల్లడించారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో 40వేల మందికి చొప్పున వేశారు. ఒక్కొక్కరికి 0.5 ఎంఎల్ టీకా వేశారు. 28 రోజుల అనంతరం వీరికి రెండో డోసు వేయనున్నారు. జిల్లా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ వయసు కలిగిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది ఉన్నారు. మరో పక్క దేశవ్యాప్తంగా తొలిరోజు 41 లక్షల మందికిపైగా టీకా తీసుకున్నారు.
0 Post a Comment:
Post a Comment