Thursday 20 January 2022

గర్జించిన గురువులు : పీఆర్సీపై ఆందోళనలో 3.80 లక్షల మంది పాల్గొన్నారన్న ఫ్యాప్టో నేతలు.

 గర్జించిన గురువులు : పీఆర్సీపై ఆందోళనలో 3.80 లక్షల మంది పాల్గొన్నారన్న ఫ్యాప్టో నేతలు.



ముళ్ల కంచెలను దాటి... నిర్బంధాలను ఛేదించి కలెక్టరేట్‌ల ముట్టడి.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల కంచెలు, బారికేడ్లతో నిలువరించినా... లెక్క చేయకుండా వేలాదిగా కదం తొక్కుతూ గురువారం ఉదయానికే కలెక్టరేట్లకు తరలివచ్చారు. జిల్లాల పాలనా కార్యాలయాలను స్తంభింపజేశారు. మాటతప్పిన, మడమ తిప్పిన సీఎం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రివర్స్‌ పీఆర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. నిరసనల్లో మహిళా ఉపాధ్యాయులు ముందు భాగాన నిలిచి పాటలతో గళమెత్తారు. ఫ్యాప్టో (ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ఉపాధ్యాయులు ముట్టడించారు. బుధవారం రాత్రి నుంచే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ సంఘ నేతల ఇళ్లకు వెళ్లి ఆందోళనల్లో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు. రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని తనిఖీ చేసి మధ్యలోనే దించేశారు. అయినా నిర్బంధాలను ఛేదించుకుంటూ భారీ ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా  పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుల్ని పోలీసులు అడ్డుకోవడంతో.. తోపులాటలు జరిగాయి. మచిలీపట్నంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు లాగి వాహనాల్లో పడేయడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కడపలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని పోలీసులు లాక్కెళ్లడంతో స్పృహతప్పి పడిపోయారు. చొక్కా చిరిగిపోయింది. చిత్తూరులో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రమణ చేతికి గాయమైంది.

గుంటూరు కలెక్టరేట్‌ దిగ్బంధం :

భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు గుంటూరు కలెక్టరేట్‌ను ముట్టడించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దిగ్బంధించారు. పోలీసులు ముందే అడ్డుకుంటారనే ఆలోచనతో... ప్రణాళిక ప్రకారం రెవెన్యూ కల్యాణ మండపం, ఎన్జీవో కల్యాణ మండపం, జడ్పీ ప్రాంగణానికి విడివిడిగా చేరుకునేలా వ్యూహం రచించారు. ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మచిలీపట్నంలో అన్ని దారులు మూసేసినా...

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్‌కు వచ్చే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసేసినా, ఉపాధ్యాయులు లక్ష్మీటాకీస్‌ సెంటరు వరకు దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. కొందరు ఉపాధ్యాయులు పోలీసుల నుంచి తప్పించుకుని కలెక్టరేట్‌ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు.

ఉపాధ్యాయ సంద్రంగా ఏలూరు :

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు సమీపంలోని జడ్పీ కార్యాలయం రహదారి వరకు అన్ని ప్రాంతాలు ఉదయం 9గంటలకే కిక్కిరిశాయి. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ హరనాథ్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.గోపిమూర్తి, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణను గృహ నిర్బంధం చేశారు. జిల్లాలోని సగం మంది ఉపాధ్యాయులు గురువారం సెలవులో ఉన్నారు.

ఒంగోలులో కేసులు పెడతామని హెచ్చరికలు :

ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చిసెంటర్‌లో ఉపాధ్యాయులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు యూటీఎఫ్‌ నాయకులను కోర్టు సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలు సీజ్‌చేస్తామని, కేసులు పెడతామని హెచ్చరించినా ఎవ్వరూ ఖాతరు చేయలేదు.

కిటకిటలాడిన కాకినాడ:

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌ వేలాది మంది ఉపాధ్యాయులతో కిటకిటలాడింది. ఓ ఉపాధ్యాయుల తల కిందికి కాళ్లు పైకి పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గీతాలు ఆలపిస్తూ.. నినాదాలు చేశారు. ఆందోళనను డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారు.

నెల్లూరులో డప్పులు కొడుతూ నినాదాలు

నెల్లూరులో ఉపాధ్యాయులను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిసూత డప్పులు కొడుతూ... పాటలు, నృత్యాలతో ప్రదర్శించారు. మధ్యాహ్నం వేళ బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించారు.

చిత్తూరులో తోపులాట :

చిత్తూరులో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్‌ లోనికి వెళ్లేద]ుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు దండు అమరనాథ్‌ తమకు సహకరించాలని చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి కాళ్లపై పడ్డారు. బుధవారం రాత్రి నుంచే పీలేరు, మదనపల్లె, తిరుపతిలోని ప్రధాన సంఘాల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాశారు.

కడపలో బారికేడ్లు, ముళ్లకంచెలు :

కడపలో వేలాది మంది ఉపాధ్యాయుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని వెళ్లే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, ఫ్యాప్టో జిల్లా కోఛైర్మన్‌, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ కంభం బాలగంగిరెడ్డి గృహనిర్బంధం చేశారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నుంచి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

అనంతలో హోరెత్తిన నిరసన :

అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉపాధ్యాయుల్ని పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘం నాయకుడు మనోహర్‌రెడ్డి వేలికి గాయమైంది.

కిక్కిరిసిన కర్నూలు కలెక్టరేట్‌ :

ఉపాధ్యాయుల ఆందోళనతో కర్నూలు కలెక్టరేట్‌ ప్రాంతం కిక్కిరిసింది. కొందరు ప్రధాన ద్వారం ఎక్కి లోపలకు దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 9గంటలకు 5వాహనాల్లో నంద్యాల నుంచి బయల్దేరిన ఉపాధ్యాయుల్ని పాణ్యం వద్ద పోలీసులు అడ్డగించారు. ఆగ్రహించిన ఉపాధ్యాయులు ఎన్‌హెచ్‌-44 జాతీయ రహదారిపై బైఠాయించారు.

విజయనగరంలో తోపులాట :

విజయనగరంలో ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉపాధ్యాయుల్ని కలెక్టరేట్‌ లోపలకు పోలీసులు అనుమతించ లేదు. రెండు ద్వారాల నుంచి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు ఉపాధ్యాయులు కిందపడిపోయారు.

శ్రీకాకుళంలో బారికేడ్లను ఛేదించి...

శ్రీకాకుళం కలెక్టరేట్‌ ద్వారాలను పోలీసులు మూసేశారు. అక్కడికి చేరుకునే నాలుగు మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున చొచ్చుకుని రావడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. తర్వాత కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.

విశాఖలో పెనుగులాట :

విశాఖ జిల్లా కలెక్టరేట్‌ ఎద]ుట పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య పెనుగులాట జరిగి, కొందరు కిందపడ్డారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడనాడాలని ఆందోళనకు దిగారు.

తాడోపేడో తేల్చుకుంటాం :

- జోసఫ్‌ సుధీర్‌బాబు, రాష్ట్ర ఛైర్మన్‌, ఫ్యాప్టో

ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీ తెచ్చింది. తాడోపేడో తేల్చుకోవడానికి సమ్మెకు వెళతాం. రూ.30 వేల కోట్లు లోటు ఉందంటున్న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి... ఉద్యోగసంఘాల నేతలను చర్చకు పిలిస్తే వాస్తవాలు చెబుతాం. ఐఆర్‌ 27%, ఇంటిఅద్దె గతంలో ఉన్నవిధంగానే కొనసాగించాలి. కేంద్ర పీఆర్సీని అమలు చేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి. సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్‌ను ప్రకటించాలి. గురువారం నాటి ఆందోళనలో 3.80 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top