ఫిట్మెంట్పై పోరే - 20న కలెక్టరేట్ల ముట్టడి, 28న చలో విజయవాడ : ఫ్యాప్టో ప్రకటన
ఫిట్మెంట్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని లేనిపక్షంలో పోరాటం తప్పదని ఫ్యాప్టో ప్రకటించింది . గురువారం ఉదయం ఫ్యాఫ్టో ఆధ్వర్యాన యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ఫ్యాఫ్టోలో ఉన్న సంఘాలతోపాటు అదనంగా మరో మూడు సంఘాలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి ఫ్యాప్టో ఛైర్మన్ జోసఫ్ సుధీర్బాబు అధ్యక్షత, సిహెచ్.శరత్చంద్ర అధ్యక్షత వహించారు. ప్రభుత్వం పునరాలోచన చేయనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను కలుపుకుని పోరాటం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిలో భాగంగా 20వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని, 28వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఏదీ లేదని అన్నారు. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, పరస్పర చర్చలకు తావివ్వడం లేదని చెప్పారు. ఏడోతేదీన జరిగిన సమావేశమూ ఇదే తీరుగా జరిగిందన్నారు. కో ఛైర్మన్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిఆర్సి 27 శాతం కంటే ఎక్కువ సాధించాలంటే ఐక్య పోరాటం తప్ప మరోమార్గం లేదన్నారు. కేంద్ర పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వడం అంటే ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. సిపిఎస్ విషయంలోనూ లక్షన్నర మందికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. సిపిఎస్ రద్దు బిల్లు శాసనసభలో పెట్టి అనంతరం అవగాహన లేక పెట్టామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హెచ్ఆర్ఏ శ్లాబు పోరాడి సాధించుకున్నదని, దాన్ని మారుస్తామంటే కుదరదని చెప్పారు. ఐఆర్, హెచ్ఆర్పై అధికారులతో మాట్లాడుకోండని చెప్పడం అన్యాయమని చెప్పారు. వార్డు, గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు, పెన్షనర్లను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమం చేస్తామనితెలిపారు. ఫ్యాఫ్టో సెక్రటరీ జనరల్ శరత్చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వస్తుందనిఎదురుచూశామని, నిరాశే మిగిలిందని తెలిపారు. ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని అన్నారు. ఎపిటిఎఫ్ నాయకులు పాండురంగవరప్రసాదు మాట్లాడుతూ గతంలో ఉద్యోగ సంఘాల నాయకులు పిఆర్సిని పోరాడి సాధించుకున్నారని, ప్రస్తుతం నాయకులు ప్రభుత్వాన్ని ప్రశిుంచలేకపోతున్నారని అన్నారు. ఇకముందైనా ఖచ్చితంగా పోరాడి సాధించుకోవాలన్నారు. ఎపిజెఎసి సెక్రటరీ జనరల్ హృదయరాజు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు వినలేదని, ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడుకోవాలని చెప్పారని అన్నారు. తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. ఫ్యాప్టో కార్యదర్శి ప్రకాశరావు మాట్లాడుతూ ఉమ్మడి పోరాటం ద్వారానే ప్రభుత్వం మెడలు వంచాలని తెలిపారు. టిఎన్యుఎస్ రాష్ట్ర నాయకులు కృష్ణమోహనరావు మాట్లాడుతూ ప్యాఫ్టో నిర్వహించే పోరాటాలకు కలిసి వస్తామని వివరించారు. పిఇటి అండ్ పిడి అసోసియేషన్ నాయకులు కొండయ్య ఆట్లాడుతూ ప్యాప్టోలో తాము కలిసి వస్తామని, ఇక ముందు పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాఫ్టో కో ఛైర్మన్లు వి.శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ చందోలు వెంకటేశ్వర్లు, కోశాధికారి శౌరిరాయలు, కె.నరహరి, భాగ్యరాజు పాల్గొన్నారు. ఉర్దూ టీచర్ల ఫెడరేషన్ నాయకులు కూడా ఫ్యాఫ్టోలో కలుస్తామని తెలిపారు.
భోగి మంటల్లో అధికారుల కమిటీ నివేదిక : ఫ్యాప్టో
రౌండ్టేబుల్ అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారుల కమిటీ ఇచ్చిన పిఆర్సి నివేదికను భోగిమంటల్లో దగ్ధం చేయాలని ఫ్యాప్టో కోరింది. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం పిఆర్సిని వ్యతిరేకించే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారుల కమిటీ నివేదికను దగ్ధం చేయాలని కోరారు.
0 Post a Comment:
Post a Comment