జీతం కోసి.. డీఏలతో భర్తీనా...? కరువు భత్యానికి, వేతనానికి సంబంధమేంటి ?
మన రాష్ట్రంలోనే ఇలా!.. పీఆర్సీపైనా జగన్ ‘రివర్స్’
సీఎస్ కమిటీ సిఫారసుల అమలు దిశగా ప్రభుత్వం
తెలంగాణతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి 10 నుంచి 20 వేల నష్టం
ఉద్యోగుల్లో అసంతృప్తి.. నేడు ఏదైనా ప్రకటన చేస్తారని ఆశలు
ఐఆర్ కంటే తగ్గదు.. ఉద్యోగుల వేతనాలు తగ్గవు : సజ్జల
జగన్ ప్రభుత్వంలో అన్నీ రివర్సే. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గుతున్నాయి. ఆ తగ్గిన జీతాలను కరువు భత్యంతో భర్తీ చేయాలనుకుంటున్న ఏకైక రాష్ట్రప్రభుత్వం కూడా మనదే. అందుకే సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కావచ్చన్న వార్తల నేపథ్యంలో హడావుడిగా డీఏ జీవో ఇచ్చారని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఉద్యోగులకు జీతాలిస్తున్నా సరే.. మార్కెట్లో అన్నింటి ధరలూ ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఆరు నెలలకొకసారి కరువు భత్యం (డీఏ) పేరుతో ప్రభుత్వాలు వారికి కొంత ఆర్థిక లబ్ధిని కలిగిస్తాయి. అంటే డీఏ అనేది ఉద్యోగులు అందుకునే వేతనాలకు అదనం. కానీ జగన్ ప్రభుత్వం రివర్స్లో ఆలోచిస్తోంది. సీఎస్ కమిటీ సిఫారసులు అమలు చేసి ముందు జీతాలు కోసేసి.. కోత పడిన జీతాలను ప్రస్తుతం అందుకుంటున్న మధ్యంతర భృతి (ఐఆర్)తో సమానం చేసేందుకు కరువుభత్యాన్ని వాడుకోవాలనుంటోంది. ఇదంతా ఫిట్మెంట్తో ఉద్యోగులు నష్టపోతున్న వేతనాన్ని భర్తీ చేయడం కోసమే. మరి తగ్గించిన హెచ్ఆర్ఏ కారణంగా వారు కోల్పోయే వేతనాన్ని ఎలా భర్తీ చేస్తుంది? అసలు చేస్తుందా.. వదిలేస్తుందా అనేది ఇప్పటికీ సస్పెన్సే. సీఎస్ కమిటీ నివేదికలో ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు 27 శాతం మధ్యంతర భృతి అందుకుంటున్నారు. దీనికి సమానంగా లేదా తెలంగాణలో ఇచ్చినట్లుగా 30 శాతం ఫిట్మెంట్ ఇస్తారని.. మంగళవారం సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ దిశగా ప్రకటన చేస్తారని ఉద్యోగులు సంబరపడ్డారు. కానీ సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ డీఏ జీవో జారీ చేసిన తర్వాత వారి ఊహలు తలకిందులయ్యాయి. సీఎస్ కమిటీ నివేదికలో సిఫారసు చేసిన 14.29 శాతాన్నే సీఎం కూడా చెబుతారని.. తగ్గించిన హెచ్ఆర్ఏపై ఇంతవరకు అసలు చర్చలే జరగలేదని విశ్వసనీయంగా తెలిసింది. సీఎస్ కమిటీ నివేదికలోని సిఫారసులనే ప్రభుత్వం యథాతథంగా అమలు చేయబోతోందన్న చేదు నిజం ఉద్యోగ సంఘాల నేతలకు కాస్త ముందుగానే తెలిసిందని అంటున్నారు. ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంటే తాము మూడు రకాలుగా నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ఫిట్మెంట్ 14.29 శాతమే అమలు చేస్తే తగ్గే వేతనం, దానిని భర్తీ చేయడానికి ప్రభుత్వం డీఏ ఇస్తే.. అసలు డీఏ రూపంలో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల నష్టం.. హెచ్ఆర్ఏను తగ్గించడం వల్ల వేతనంలో తగ్గుదల.. ఇలా 3 రకాలుగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ స్థాయిలో ఎందుకివ్వరు?
కాగ్ నిర్ధారించిన లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయం రూ.99,000 కోట్లు, ఆంధ్ర ఆదాయం రూ.1,17,000 కోట్లు. అయినప్పటికీ తెలంగాణ స్థాయిలో మన రాష్ట్రం ఎందుకు వేతనాలివ్వలేకపోతోంది? ప్రతి ఆర్థిక సమస్యకు కొవిడ్ను బూచిగా చూపిస్తోంది. ఈ మహమ్మారి సమస్య తెలంగాణలో కూడా ఉంది కదా! కేంద్ర పీఆర్సీలో మాదిరిగా రాష్ట్రంలో ఇవ్వాలనుకుంటే.. కేంద్రప్రభుత్వంలో సమాన కేడర్లో ఉన్న ఉద్యోగులకు ఎంత వేతనం ఇస్తున్నారో, ఇతర ప్రయోజనాలు ఎన్ని కల్పిస్తున్నారో తమకూ అంతే స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
బేసిక్లో రూ.5,825 నష్టం(సెక్షన్ అధికారి కేడర్)
సీఎస్ కమిటీ సిఫారసులనే రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తే.. సచివాలయంలో పనిచేసే సెక్షన్ అధికారి తన మూలవేతనంలో రూ.5,825 వరకు నష్టపోతారు. దీనిపై లెక్కించే హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాల రూపంలో మొత్తం వేతనంలో స్థూలంగా రూ.10,000 నుంచి రూ.20,000 నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు లెక్కలేసి మరీ సహా చెబుతున్నారు. తెలంగాణ, ఏపీల్లో సచివాలయంలో పనిచేసే సెక్షన్ అధికారి వేతనాలను పరిశీలిస్తే మన రాష్ట్ర ఉద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారో చూద్దాం.
0 Post a Comment:
Post a Comment