Friday 17 December 2021

పెంచాల్సిన జీతం తుంచేసి...! పీఆర్సీపై సర్కారు వ్యూహం...!

 పెంచాల్సిన జీతం తుంచేసి...! పీఆర్సీపై సర్కారు వ్యూహం...!



ఫిట్‌మెంట్‌గా 14.29 ఫిక్స్...‌!

పైకి 30 ప్రయోజనం మాటలు 

అయినా పెరగాల్సినంత పెరగదు

ఇప్పుడొస్తున్న జీతమే సర్దుబాటు

ఇప్పటికే ఆరు డీఏలు పెండింగ్‌

వాటితో గోల్‌మాల్‌ చేసే చాన్స్‌

అదనపు భారం పడకుండా ప్లాన్‌

తెలంగాణ తరహాలో కసరత్తు

‘పీఆర్సీపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. నష్టం జరగకుండా చూస్తాం’... ఇది ఉద్యోగులకు ప్రభుత్వం పదేపదే చెబుతున్న మాట! అదే సమయంలో... కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసినట్లుగా 14.29శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే ఇస్తామంటోంది. చివరికి... ‘పీఆర్సీలో 30శాతం లబ్ధి’ అని ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశముంది. ‘హమ్మయ్య... 14.29 అన్నారు. 30శాతానికి పెంచారు’ అని ఉద్యోగులు ఊపిరిపీల్చుకుంటే... అక్కడే తప్పులు కాలేసినట్లే! ఎందుకంటే... ప్రభుత్వం ఇక్కడే గోల్‌మాల్‌ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నికరంగా ఇచ్చే ప్రయోజనం 14.29శాతం మాత్రమే! మిగిలిందంతా... ఇప్పటికే ఉద్యోగులకు వేర్వేరు రూపాల్లో దక్కాల్సిన ప్రయోజనాలే! అదీ ఇదీ కలిపి ‘30 శాతం’ లబ్ధి అని తేల్చే అవకాశమున్నట్లు అనుమానిస్తున్నారు. దీని సారాంశం ఏమిటంటే... ఉద్యోగులకు పెరగాల్సిన జీతాలు పెరగవు. అలాగని తగ్గవు. ఇప్పుడు ఐఆర్‌గా సిఫారసు చేసిన 27శాతాన్ని ఫిట్‌మెంట్‌గా ప్రకటిస్తే జీతాలు బాగా పెరిగిపోతాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. అందుకే వేతనాల ఖర్చు తగ్గించుకునేందుకు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటోంది. సీఎస్‌ కమిటీ నివేదిక వెనుక ఉన్న రహస్యం ఇదే. తెలంగాణ పీఆర్సీ 7.5శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. దీనికి రెండు ఇంక్రిమెంట్లు, ఒక స్టెప్‌ అప్‌, ఒక డీఏ కలిపి మొత్తం 15.5 శాతం ‘ఫిట్‌మెంట్‌’తో వేతనస్కేళ్లను సవరించి కొత్త మూలవేతనం నిర్ణయించింది. మొత్తంగా 30శాతం లబ్ధి చేకూరేలా పీఆర్సీ వర్తింపజేశారు. ఏపీలో సీఎస్‌ కమిటీ తన నివేదికలో సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ 14.29 శాతం కూడా ఇలాంటిదే. ‘తెలంగాణలో ఉద్యోగుల వేతన స్కేళ్లను 7.5 శాతంతో సవరించారు’ అని సీఎస్‌ కమిటీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. కానీ, అక్కడ రెండు ఇంక్రిమెంట్లు, ఒక స్టెప్‌ అప్‌, ఒక డీఏ కలిపి... 15.5 శాతానికి చేర్చిన సంగతిని విస్మరించింది. ఇప్పుడు...దానికంటే తక్కువగా 14.29శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందని చెబుతోంది. మిగిలిన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారనేదే సస్పెన్స్‌! ఇప్పటికే ఉద్యోగులకు 6డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో మరొక డీఏ ‘డ్యూ’ అవుతుంది. మరి... ఈ డీఏలను ఏం చేస్తారు? ఇచ్చేస్తారా... ఇచ్చినట్లు చూపిస్తారా? 14.29 శాతం మాత్రమే ఫిట్‌మెంట్‌ ఇచ్చేసి, డీఏ లెక్కల్లో గోల్‌మాల్‌ చేసి... ఇప్పుడు వస్తున్న జీతాన్నే పీఆర్సీ తర్వాత కూడా వచ్చేలా చేస్తారా? ఇదే జరిగితే ఉద్యోగులు రెండు రకాలుగా నష్టపోతారు. ఒకటి... ఎప్పటి నుంచో రావాల్సిన డీఏ ప్రయోజనాలు అందకుండా పోతాయి. రెండు... పీఆర్సీలో వేతన స్కేలు కూడా తగ్గుతుంది.

అసలు నివేదికపై గప్‌చుప్‌ :

ఏపీలో అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలో నియమించిన పీఆర్సీ తన నివేదికలో మొదట 23శాతం ఫిట్‌మెంట్‌తో వేతన స్కేళ్లను సవరించాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక 27శాతం ఐఆర్‌ ప్రకటించింది. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఉండటమే తప్ప, తగ్గడం ఇప్పటిదాకా లేదు. ఈ నేపథ్యంలో మిశ్రా కమిషన్‌ 27శాతం ఫిట్‌మెంట్‌తో వేతన స్కేళ్లను ప్రతిపాదించింది. కానీ... ఆ మేరకు పీఆర్సీ అమలు చేస్తే భారం మోయలేమని ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్సీ నివేదిక బయటికి వస్తే... ఉద్యోగ సంఘాలు అస్త్రంగా వాడుకునే అవకాశముంది. అందుకే... ఆ నివేదికను బయటపెట్టకుండా, తమకు కావాల్సిన విధంగా సీఎస్‌ కమిటీ నివేదికను రూపొందించారు. ఈ కమిటీ తెలంగాణ ‘ఫార్ములా’ను అనుసరిస్తూ 14.29శాతం ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసింది.

హెచ్‌ఆర్‌ఏలో అన్యాయం : 

తెలంగాణలో కనిష్ఠంగా 11 శాతం, గరిష్ఠంగా 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తోంది. ఏపీలో మాత్రం... కనీసం 8శాతం, గరిష్ఠంగా 16 శాతం హెచ్‌ఆర్‌ఏను కమిటీ సిఫారసు చేసింది. దీంతో... మెజారిటీ ఉద్యోగులకు గతంలోకంటే హెచ్‌ఆర్‌ఏ తగ్గుతుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సెక్రటేరియట్‌, హెవోడీల హెచ్‌ఆర్‌ఏ 30నుంచి ఏకంగా 16శాతానికి తగ్గుతుంది. వేతన స్కేళ్ల సవరణలో తెలంగాణను అనుసరించాలనుకుంటున్న ప్రభుత్వం... పీఆర్సీ తాలూకు ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగులకు అందించడంలో తెలంగాణకంటే రెండేళ్లు వెనుకబడింది. తెలంగాణ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ నుంచి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి తెచ్చింది. 2021 మార్చి వరకు అందాల్సిన ప్రయోజనాలను అరియర్స్‌ రూపంలో, 2021 ఏప్రిల్‌ నుంచి వేతనంతో కలిపి అందజేస్తున్నారు. ఏపీ ప్రభుత్వమేమో 2022 నవంబరులో ఇచ్చే వేతనాలతో పీఆర్సీ అమలు చేస్తామంటోంది. సీసీఏను ఎత్తేసింది. ప్రస్తుతం నెలకు రూ.400గా ఉన్న సీసీఏను నెలకు రూ.1000కి పెంచాలని అశుతోష్‌ కమిషన్‌ సూచించింది. ఈ ప్రయోజనాలను ఉద్యోగులకు అందకుండా ఉండేందుకు కేంద్రం సీసీఏను ఎత్తేసిందని సీఎస్‌ కమిటీ పేర్కొంది. కానీ, కేంద్రం దాని స్థానంలో రవాణా అలవెన్సు అమలు చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఉద్యోగులకు 14.29 శాతం పీఆర్సీ ఇవ్వాలన్న నిర్ణయంపై ప్రభుత్వం గట్టిగా ఉంటే ఉద్యోగ సంఘాల నాయకులను సీఎం దగ్గరకు ఎందుకు తీసుకెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ తరహాలో తమ వేతన స్కేళ్లను 14.29 శాతంతో సవరించి, ఆపై మొత్తం 30 పెరుగుదల నమోదయ్యేలా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top