రాత్రి కర్ఫ్యూలు, నిబంధనలు కఠిన ఆంక్షల బాటలో రాష్ట్రాలు - యూపీలో ‘నో మాస్క్, నో గూడ్స్’ అమలు
కొవిడ్ కేసులు పలుచోట్ల పెరుగుతుండటం.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షల బాట పడుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 25 (శనివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. వీధులు, మార్కెట్లలో మాస్కులను తప్పనిసరి చేసింది. రోజూ రాత్రి 11 నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. మాస్కుల్లేకుండా వచ్చిన వారికి వ్యాపారులెవరూ వస్తువులు విక్రయించకుండా ‘నో మాస్క్, నో గూడ్స్’ విధానాన్ని పాటించేలా చర్యలు చేపట్టాలని యూపీ సర్కారు ఆదేశించింది.
ఛత్తీస్గఢ్లో సామాజిక, మతపరమైన ఉత్సవాలు; నూతన సంవత్సర వేడుకల్లో 50 మందికి మించి ఉండకుండా కఠిన నిబంధనలు విధించారు.
గుజరాత్లో అహ్మదాబాద్ సహా 8 ప్రధాన నగరాల్లో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ వేళలను (రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు) పొడిగించారు. మధ్యప్రదేశ్లోనూ రాత్రి కర్ఫ్యూ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది.
దిల్లీలో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి రెండు రోజుల్లో రూ. 1.54 కోట్లు అపరాధ రుసుం వసూలు చేశారు. ఒడిశాలో ఈ నెల 25 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు విధించారు. టీకా తీసుకోనివారు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది.
108 దేశాల్లో ఒమిక్రాన్...
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో వ్యాపించింది. ఇంతవరకు మొత్తం 1.5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 26 మంది మృతి చెందారు.
381కి పెరిగిన కొత్త వేరియంట్ బాధితులు :
దిల్లీ: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య శుక్రవారం 381కి పెరిగింది. ఇంతవరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి.
6,650 కేసులు, 374 మరణాలు :
దేశంలో గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 6,650 కొవిడ్ కేసులు బయటపడగా.. 374 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,72,626కి చేరింది. మహమ్మారి బారినపడి ఇంతవరకు 4,79,133 మంది ప్రాణాలు కోల్పోయారు.
0 Post a Comment:
Post a Comment