ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు - 2022-23 నుంచి ‘విద్యాహక్కు’ అమలు చేస్తాం : హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) మేరకు ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యేగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు .. 25శాతం సీట్లు ఉచితంగా భర్తీ చేయడాన్ని నిలువరిస్తూ 2010లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. చట్టం అమలుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని, పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎ్సవోపీ)లో పేర్కొన్న విధంగా ఈ ఏడాది సెప్టెంబరు 14న, అక్టోబరు 4న స్టేక్ హోల్డర్స్, సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రైవేటు పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరంలో మొత్తం 1,19,550 మంది ఒకటవ తరగతిలో చేరారు. వీరిలో 65,560మంది బాలురు, 53,994 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 29,887 మంది విద్యాహక్కుల చట్టంలోని సెక్షన్ 12(1)(సి) మేరకు ప్రైవేటు పాఠశాలల్లో కేటాయించే 25శాతం సీట్లకు అర్హులు. ప్రభుత్వం జీవో 53 ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజును ఖరారు చేసింది. దాని ప్రకారం విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు 33 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 16న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 25శాతం సీట్లు ఫీజు చెల్లింపు, రీయింబర్స్మెంట్ విధానంలో సమగ్రశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. విద్యాహక్కు చట్టం కింద అర్హులైన విద్యార్థులను గుర్తించేందుకు కేంద్రం ఎస్వోపీ మేరకు 6 అంచెల విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. రాబోయే విద్యాసంవత్సరానికి విద్యార్థుల సమాచారం సేకరించాలని ఆదేశాలిచ్చాం. అడ్మిషన్ ప్రక్రియను విద్యాసంవత్సరం ప్రారంభానికి ఏడాది ముందే పూర్తి చేయాలి. నిరుపేద విద్యార్థులు నష్టపోకుండా విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను రూపొందించాలి. సంబంధిత పాఠశాలల్లో ప్రస్తుత ఏడాది ఫీజు, రాబోయే ఐదేళ్లలో వసూలు చేసే ఫీజు వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాలి. 2021-22 విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 3నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు మూడు నెలల సమయం ఇవ్వండి అని అఫిడవిట్లో పేర్కొన్నారు.
0 Post a Comment:
Post a Comment