పీఎఫ్ : రూ.5లక్షల వరకూ పన్ను ఉండదట. కానీ...!
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)లో రూ.2.5లక్షల వరకూ డిపాజిట్ మొత్తంపై పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీన్ని రూ.5లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక బిల్లు -2021లో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక పెట్టారు.
సాధారణంగా ఈపీఎఫ్ చట్టం ప్రకారం నిర్బంధ చందా కింద వేతనం (మూల వేతనం, డీఏ)లో 12శాతం ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్లో జమచేయాలి. అంతే మొత్తం యాజమాన్యం తన వాటా కింద చెల్లిస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించిన ప్రకారం రూ.5లక్షల వరకూ డిపాజిట్ చేసే మొత్తంపై పన్ను మినహాయింపు పొందాలంటే యాజమాన్యం జమ చేసే వాటాను వద్దనుకోవాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది.
పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి తాజా బడ్జెట్లో కొత్త నిబంధనలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ఇకపై రూ.2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆపై జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇది ఏప్రిల్ 1, 2021 నుంచి చేసే జమలకే వర్తించనుంది. అధిక వేతనాలు తీసుకుంటున్న ఉన్నతోద్యోగుల ఆదాయంపై పన్ను మినహాయింపును హేతుబద్ధీకరణ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
0 Post a Comment:
Post a Comment